సిద్ధూపై నిషేధం.. క్రికెటర్కు చేదు అనుభవం.. వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనలు
జమ్ము, కశ్మీర్లోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి నేపథ్యంలో పంజాబ్ మంత్రి, క్రికెటర్, టెలివిజన్ హోస్ట్ నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సిద్ధూపై ఇంకా నిరసనల సెగలు భారీగానే వినిపిస్తున్నాయి. తాజాగా ఫిలిం ఫెడరేషన్ సంస్థ సిద్ధూపై కన్నెర్ర జేసింది. ముంబైలోని ఫిల్మ్ సిటీ ప్రాంతానికి రాకుండా నిషేధాన్ని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

నవజ్యోత్ సింగ్ సిద్ధూపై నిషేధం
కపిల్ శర్మ షోలో హోస్ట్గా సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిద్ధూను ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా నిషేధం విధించాలి అని డిమాండ్చేసింది. ఫిల్మ్ సిటీలో జరిగే షూటింగ్లకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చింది.

పాక్ నటీనటులపై కూడా బ్యాన్
అంతేకాకుండా దేశంలోని పాకిస్థానీ నటీనటులపై నిషేధం విధించాలని పిలుపునిచ్చింది. పాకిస్థాన్ నటులను ప్రోత్సహిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫెడరేషన్ హెచ్చరించింది.

జవాన్లపై దాడిపై ఖండన
భారత జవాన్లపై జరిగిన దాడిని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ తీవ్రంగా ఖండించింది. జవాన్ల కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. సోషల్ మీడియాలో జరుగుతున్న నిరసన ఉద్యమానికి సంఘీభావం తెలిపింది.

సోషల్ మీడియాలో రచ్చ
సోషల్ మీడియాలో సిద్ధూపై నిరసన తీవ్రస్థాయిలో జరుగుతున్నది. #BoycottSidhu', '#BoycottKapilSharmaShow', '#UnsubscribeSonyTV' హ్యాష్ట్యాగ్లతో నిరసనలు హోరెత్తుతున్నాయి. అయితే కపిల్ షోలో సిద్ధూ కొనసాగుతున్నాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోవడం అనేక సందేహాలకు దారితీస్తున్నది.


Click it and Unblock the Notifications











