twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈటీవీలో ఒక్కసారైనా వార్తలు చదవాలన్న కోరిక

    By Srikanya
    |

    TV Anchor Subhashini wants to become News Reader
    హైదరాబాద్ : ఈటీవీ-2 'సఖి' కార్యక్రమం నాకెంతో గుర్తింపుని తెచ్చిపెట్టింది. దాన్ని చూసి అప్పటి సిక్కిం గవర్నర్‌ సతీమణి ఒకరు స్వయంగా లేఖ రాశారు. దూరదర్శన్‌ మాజీ డైరెక్టర్‌ ఒకరు 'చక్కటి తెలుగు మాట్లాడుతున్నావమ్మా...' అంటూ ప్రశంసిస్తూ పెద్ద ఉత్తరమే రాశారు. ఇలా పదిహేనేళ్ల కరీర్‌లో ఎన్నో ప్రశంసలు అందుకున్నా, ఇప్పటికీ నేను సాధించాల్సింది ఎంతో ఉంది. చిన్నప్పుడు కలలు కన్న న్యూస్‌ రీడర్‌ని కాలేకపోయానని అప్పుడప్పుడూ అనిపిస్తుంది. భవిష్యత్తులో ఈటీవీలో ఒక్కసారైనా వార్తలు చదవాలన్న కోరిక మిగిలే ఉంది. ఎప్పటికైనా తీరుతుందనే అనుకుంటున్నా అంటోంది సుభాషిణి.

    చిన్నితెరపై కనిపించాలని కలలు కన్న ఆమె తపన నిజమైంది. తనను తాను నిరూపించుకొన్నా 'నేను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకా కష్టపడాల్సి ఉంది' అంటోంది 'సినీ రంజని', 'సఖి', 'తెలుగు వెలుగు' వంటి పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సుభాషిణి తన మనస్సులో మాటలను మీడియాతో పంచుకుంది.

    తన కుటుంబం గురించి చెప్తూ... మాది గుంటూరు జిల్లాలోని తెనాలి పక్కన కొల్లిపర గ్రామం. నాన్న వ్యవసాయం చేసేవారు. అమ్మ గృహిణి. చిన్నప్పట్నుంచీ నేను చదువులో చురుకే. అయితే ఇంటర్‌ వరకూ ఓ కచ్చితమైన లక్ష్యం ఉండేది కాదు. డిగ్రీకి వచ్చాక దూరదర్శన్‌లో ఢిల్లీ వార్తలను చదివే సంగీత అనే న్యూస్‌ రీడర్‌ నన్నెంతో ఆకట్టుకొంది. ఆవిడని చూసి నేనూ అలా వార్తలు చదవాలని కలలు కనేదాన్ని. తెలుగు వార్తాపత్రికలు దగ్గరపెట్టుకొని ఆవిడలా చదివేందుకు ప్రయత్నించేదాన్ని. అమ్మానాన్నలు సంప్రదాయ తరానికి చెందిన వాళ్లు. నేను న్యూస్‌రీడర్‌గా శిక్షణగా తీసుకొనేందుకు హైదరాబాద్‌ వెళ్తానంటే ససేమిరా అన్నారు. 'బుద్ధిగా చదువుకుని, కుదిరితే ఏదయినా ఉద్యోగం చెయ్‌' అని చెప్పారు. నాకేమో టీవీ తెరపై కనిపించకపోయినా కనీసం రేడియోలో అయినా వార్తలు చదవాలని ఉండేది. అదే విషయం అమ్మానాన్నలకు చెప్పి, ఒప్పించాలనుకున్నా. అయినా ఫలితం లేకపోవడంతో సర్దుకుపోయా అన్నారు.

    ఆఫర్స్ గురించి చెప్తూ...డిగ్రీ అయింది. పీజీలో చేరిన కొద్దిరోజులకే మేనమామతో వివాహమైంది. తను ఓ ప్రైవేటు సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌. మాకో బాబు పుట్టిన ఏడాదికి ఈటీవీ వారిచ్చిన ఉద్యోగ ప్రకటన చూసి, మా వారికి నా మనసులో మాట చెప్పా. ఆయన సరేననడంతో, ఉత్సాహంగా దరఖాస్తు చేశా. ప్రాథమిక పరీక్షలకు చాలామంది హాజరయ్యారు. అంతమందిని చూసి, నేను ఎంపికవుతానా అని భయపడ్డా. కానీ రెండు మూడు దశల్లో జరిగిన వడపోతలో విజయం సాధించా. శిక్షణ కోసం చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితి. అప్పటికి మా బాబు వయసు ఏడాది. వాణ్ని వదిలి వెళ్లడం కష్టం అనిపించింది. అందుకే న్యూస్‌రీడర్‌గా కాకుండా యాంకరింగ్‌ అవకాశం వస్తే చేద్దాం అనుకున్నా. అలా ఈటీవీలో 'సినీ రంజని'కి పనిచేసే అవకాశం లభించింది. ఆ కార్యక్రమంతో చాలా మంచి పేరొచ్చింది. తరవాత 'జీవన రేఖ', 'హృదయం', 'సఖి', 'తీర్థయాత్ర', 'తెలుగువెలుగు', రాశిచక్రం వంటి కార్యక్రమాలకు పనిచేశా. అన్నీ కలిపి కొన్ని వేల ఎపిసోడ్లు ఉంటాయి.

    సన్మానం చేశారని చెప్తూ...మొదట్లో 'ఆడపిల్లకు ఉద్యోగం, టీవీల్లో కనిపించడం వంటివి అవసరమా' అన్న బంధువుల్లో చాలామంది నేను తెరపై కనిపించి, అభినందనలు అందుకోవడం చూశాక 'మా సుభాషిణి' అంటూ మురిసిపోయారు. వూరికెళితే ఓ సెలెబ్రిటీ వస్తుందన్నట్లు వేచి ఉండేవాళ్లు. వాళ్ల అభిమానాన్ని చూపించుకునేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరీ సన్మానం చేశారు. నేను చదివిన కాలేజీ వాళ్లు పాతికేళ్ల వార్షికోత్సవంలో భాగంగా నన్ను గుర్తించి సత్కరించడం మరిచిపోలేని అనుభూతి అంటూ చెప్పుకొచ్చారామె.

    English summary
    Subhashini came to Hyderabad to be a newsreader on the small screen. Destiny had other plans for her and she became part of the Sakhi team since its inception.I wanted to anchor news but I am quite happy with shows that, apart from entertainment, are also informative and educative. If you look, most of the shows that I agree to present come with a touch of difference,” she says. Presently, she is doing a show for RTV and also is busy with ‘Srujana’ for Maha TV, ‘Sukhibhava’ on ETV2 and ‘Pragathi Patham’ for Doordarshan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X