రేపే చివరి తేది: తెలుగు ఛానెళ్లు పాల్గొంటున్నాయా?
హైదరాబాద్ : తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో పిల్లలకు సంబంధించి ప్రసారమయ్యే కార్యక్రమాలను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు యునిసెఫ్ ప్రతినిధులు వెల్లడించారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యునిసెఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షుడు రూత్ లియానో, ప్రొసన్ సేన్ తదితరులు మాట్లాడారు.

ఈనెల 6 నుంచి బాలల దినోత్సవమైన నవంబరు 14 వరకు ఛానెళ్లలో ప్రసారమయ్యే బాలల కార్యక్రమాలను ప్రత్యేక కమిటీ పరిశీలింస్తుందన్నారు. తొమ్మిది విభాగాల్లో అవార్డులను అందజేస్తారన్నారు. డాక్యుమెంటరీ(పిల్లల ఆరోగ్యం, విద్య, రక్షణ, బాలల హక్కులు, ఆహార భద్రత, పౌష్టికాహారం), బాలలకు సంబంధించిన చర్చలు, సీరియల్స్, లఘుచిత్రాలు, వార్తా కథనాలు, ప్రజా సేవ, క్లిష్టమైన అంశాలు, స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చే ఛానెల్ తదితర అంశాల్లో అవార్డులను అందిస్తారు.
పోటీ పడే ఛానెళ్ల ప్రతినిధులు ఈ నెల 5లోగా నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది. పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ బాలల హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలకు ఉందన్నారు. నేర వార్తల్లో బాలలను చూపించకూడదనే నిబంధనలను కొందరు పాటించడం లేదన్నారు.


Click it and Unblock the Notifications











