ఎన్టీఆర్ - కొరటాల మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్: అతడి కోసం ఏకంగా రూ. 4.50 కోట్లు
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్లో కనిపిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కాలంలోనే 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి విజయాలను అందుకున్నాడతను. ఈ జోష్లోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ చిత్రంలో తారక్.. కొమరం భీంగా, మెగా హీరో అల్లూరిగా నటిస్తున్నారు.
RRR మూవీ పట్టాలపై ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా ఫైనల్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే దీని తర్వాత చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఈ ప్రాజెక్టు ప్రకటనకే పరిమితం అయిపోయింది. ఈ నేపథ్యంలో గురూజీని కాదని సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరొందిన కొరటాల శివతో సినిమాను ప్రకటించాడు. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై అప్పుడే అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ లీకైంది.
జూనియర్ ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా ఎవరిని తీసుకున్నారు అన్న దానిపై చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ కంపోజర్ మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్, ఎస్ థమన్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ను తీసుకున్నారని తెలిసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ అతడితో సంప్రదింపులు జరపగా.. దీనికి ఓకే చెప్పేశాడనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్టులో పని చేసేందుకు అనిరుధ్ రవించందర్ ఏకంగా రూ. 4.50 కోట్లు డిమాండ్ చేశాడట. అయితే, అతడికి ఉన్న టాలెంట్, డిమాండ్ ఇలా అన్నింటినీ పరిశీలించిన చిత్ర యూనిట్.. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందని తెలుస్తోంది. ఇక, దీనికి సంబంధించిన ప్రకటన కొన్ని ఫార్మాలిటీస్ పూర్తైన వెంటనే అంటే అతి త్వరలోనే రాబోతుందని అంటున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు ఫైనల్ అయ్యాడన్న వార్తతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అతడి మాస్ బీట్లకు తారక్ ఎలాంటి స్టెప్పులు వేస్తాడో చూడాలి అంటూ ఇప్పటి నుంచే ఈ కాంబోపై అంచనాలను పెంచేస్తున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ ప్రాజెక్టు పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో రూపొందుతుందని తెలుస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రెండు విభిన్నమైన రోల్స్ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు దేశ రాజకీయాలను శాసించేలా ఎదగడమే దీని నేపథ్యం అని టాక్. ఇక, ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూనివర్శల్ కాన్సెప్టుతో రూపొందనున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్తో రాబోతుంది. ఇందులో హీరోయిన్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











