Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్ రిలీజ్.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి రివ్యూ
వెండితెరపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటడంతో పాటు పాన్ ఇండియా ట్రెండ్కి శ్రీకారం చుట్టింది బాహుబలి. ప్రాంతీయ భాషా చిత్రం ఏ స్థాయిలో వసూళ్లు సాధించగలదో బాలీవుడ్కి రుచి చూపించి.. ఇండియన్ సినిమా అంటే హిందీ ఇండస్ట్రీ మాత్రమే కాదని నిరూపించింది.
వరల్డ్ వైడ్గా బాహుబలి ది ఎపిక్ రిలీజ్
బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కన్క్లూజన్ పేరుతో రిలీజైన రెండు భాగాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నేపథ్యంలో బాహుబలిని మరోసారి ప్రేక్షకుల మందుకు తీసుకురావాలని నిర్ణయించారు. ఇక్కడా రాజమౌళి తన ముద్రవేశారు. రెండు భాగాలను విడివిడిగా కాకుండా రెండు భాగాలను కలిపి ఒకేసారి రిలీజ్ చేసి మరో ట్రెండ్ క్రియేట్ చేశారు జక్కన్న. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాహుబలి తారాగణం
బాహుబలి సిరీస్లో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా, తమన్నా భాటియా లీడ్ రోల్స్ పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మించగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజ్, అడవి శేష్, రోహిణి, కల్పలత, రోహిణి, తనికెళ్ల భరణి, ప్రభాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, దర్శకుడు రాజమౌళిలు గెస్ట్ పాత్రలో కనిపించగా.. నోరా ఫతేహి ఐటెం సాంగ్ చేశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందించారు.
హాట్ కేకుల్లా టికెట్ బుకింగ్స్
నార్త్ అమెరికా, తదితర దేశాలలో అక్టోబర్ 30వ తేదీ ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సినిమాకు టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవ్వగా మరోసారి కలెక్షన్ల వర్షమేనని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక సినిమాను చూస్తున్న ప్రేక్షకులు పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఫ్రెష్గా ఫీలింగ్ వస్తుందని చెబుతున్నారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా బాహుబలి ది ఎపిక్ని చూసి దర్శకుడు రాజమౌళితో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందిస్తున్నారు.
బాహుబలికి 10 ఆస్కార్స్ రావాలి
తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి .. బాహుబలి ది ఎపిక్ సినిమాను హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్లో వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పదేళ్ల తర్వాత చూస్తే.. ఈరోజే రిలీజై, ఫస్ట్ టైమ్ చూస్తున్నంత అద్భుతంగా ఉంది మూవీ. రోజూ ఇంట్లో కూడా చూస్తూనే ఉన్నాం.. అయినా కూడా ఈరోజు థియేటర్లో చూస్తే ఈరోజే రిలీజై చూస్తున్నట్లుగా ఉంది. ఈ సినిమాకు 10 ఆస్కార్స్ రావాలని నా కోరిక.. రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, ఈ మూవీకి ఆస్కార్ వస్తే ఈ సినిమాకు మరింత గౌరవం వస్తుంది అని శ్యామలా దేవి అన్నారు.
దటీజ్ రాజమౌళి
బాహుబలి 3 తీస్తారా అని మీడియా ప్రశ్నించగా.. బాబు చేతిలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి అది రాజమౌళి గారు, ప్రభాస్ గారు ప్లాన్ చేసుకుంటారు. రాజమౌళి గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి... ఇన్ని సంవత్సరాలైనా, కలియుగం అంతమైనా ఈ బాహుబలి, ప్రభాస్, రాజమౌళిలు చిరస్థాయిగా ఈ భూమ్మీద నిలిచిపోతారు. అది బాహుబలి గొప్పతనం. ఎద్దు దగ్గర ఫైట్ సీన్ తీసేటప్పుడు నేను, కృష్ణంరాజు ఉన్నాం. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాహుబలి ప్రపంచదేశాలకి చేరుకుంటుంది, చిరస్థాయిగా నిలిచిపోతుందని కృష్ణంరాజు గారు చెప్పారు. అది ఈరోజుకు కూడా ప్రూవ్ అయ్యింది. దటీజ్ రాజమౌళి గారు, ప్రభాస్ గారు, రానా. ప్రభాస్ గారు ప్రపంచ దేశాల్లో చిరస్థాయిగా ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోతారు. సినిమా చూస్తున్నంత సేపు కంటిలో నీళ్లు వస్తూనే ఉన్నాయి. రాజమౌళి గారి కుటుంబానికి నా ధన్యవాదాలు అని శ్యామలా దేవి చెప్పారు.


Click it and Unblock the Notifications











