40 ఏళ్ల స్నేహం - 50 సార్లు ఫోన్, రోజూ అవమానమే.. కీలక విషయాలు వెల్లడించిన బాబూమోహన్!
నటుడిగా కొన్ని వందల సినిమాల్లో నటించిన బాబు మోహన్ తర్వాతికాలంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ముందు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన బాబు మోహన్ తరువాత అక్కడ టికెట్ నిరాకరించడంతో గులాబీ పార్టీలో చేరిన సంగతి కూడా తెలిసిందే. అక్కడ కూడా టికెట్ రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. అయితే తనకు కెసిఆర్ వద్ద జరిగిన అవమానం గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

కమెడియన్ గా సూపర్ క్రేజ్
1987లో ఈ ప్రశ్నకు బదులేది సినిమా ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బాబు మోహన్ ఆ తర్వాత ఆహుతి అనే సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అంకుశం, మామ గారు లాంటి సినిమాలతో ఆయన క్రేజ్ పెరిగిపోయింది. మామగారు సినిమా తర్వాత బాబు మోహన్ కోట శ్రీనివాసరావు కాంబినేషన్ బాగా పండడంతో అనేక సినిమాల్లో ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్లు పుట్టుకొచ్చాయి. అలా వీరిద్దరూ కలిసి మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు లాంటి ఎన్నో సినిమాలలో కామెడీ పండించారు.

అలా రాజకీయాల్లోకి
ఇక బాబు మోహన్ కోట శ్రీనివాసరావు కామెడీ చేసిన తర్వాత బాగా కుదిరిన కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది బ్రహ్మానందం - బాబు మోహన్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో హలో బ్రదర్, వారసుడు, అల్లరి అల్లుడు, పెదరాయుడు, పరదేశీ, అప్పుల అప్పారావు, జంబలకడిపంబ లాంటి సినిమాలు రాగా అన్ని దాదాపుగా సూపర్ హిట్ సినిమాలు గా నిలిచాయి. ఇక సినిమాల్లో మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి కూడా వచ్చారు ఆయన.

మంత్రిగా కూడా
రాజకీయాల్లోకి వచ్చాక మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై లేబర్ మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించారు. అయితే 2004, 2009 ఎన్నికల్లో మాత్రం ఆయన తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోవాలి వచ్చింది. దీంతో ఆయన స్థానంలో మరో అభ్యర్థిని టిడిపి రంగంలోకి దిగడంతో ఆయన అలిగి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

అలా టీఆర్ఎస్ లోకి
ఇక తాజాగా ఈ విషయాలన్నీ పంచుకుంటూ తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి కారణం కేసీఆర్ అని అన్నారు. మంత్రులుగా కలిసి పనిచేసిన రోజుల్లో ఉన్న పరిచయంతో ఆయన తనకు జరిగిన పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలోకి ఆహ్వానించారని పార్టీలోకి ఆహ్వానించి ఆందోల్ టికెట్ ఇవ్వడంతో అక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అని చెప్పుకొచ్చారు.

కానీ టికెట్ రాకపోవడంతో
అయితే 2018 ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఎందుకో తనను పక్కన పెట్టినట్లు అనిపించింది అని ఆయన అపాయింట్మెంట్ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించినా దొరకలేదు అని అన్నారు. దాదాపుగా 50 సార్లు ఫోన్ చేసినా ఆయన పట్టించుకోలేదని, సుమారు నలభై ఏళ్ళ స్నేహాన్ని కూడా పక్కన పెట్టేశారని అన్నారు.

అవమానాన్ని తట్టుకోలేక
వారం రోజుల పాటు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూశాను అని ప్రతి రోజు ఫోన్ చేసి ఎత్తకపోతే ఆ పరాభవాన్ని తట్టుకోలేక ఇక పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరాలని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఎన్నో లెక్కలు ఉండి ఉండవచ్చు కానీ తమ స్నేహాన్ని గుర్తు పెట్టుకుని ఒక్కసారైనా తనకు మాట్లాడి అసలు విషయం చెప్పి ఉంటే బాగుండేది అని ఆయన అన్నారు. ఇక తనను ఓడించిన ప్రజలకు ఇప్పుడు విషయం అర్థం అయిందని వారి తనవద్ద బాధ పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











