ఏపీలో థియేటర్లు ఓపెన్ అవుతాయా ? రేపటి సినిమాల పరిస్థితి ఏంటి?
ఆంధ్ర ప్రదేశ్ తెలుగు సినిమా ప్రియులందరూ సందిగ్ధతలో మునిగి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రేపు దాదాపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా థియేటర్ల ఓపెనింగ్ మాత్రం ఎల్లుండి నుంచి అంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.

ఏం జరగబోతోంది
ఆంధ్రప్రదేశ్ లో జూలై 31వ తేదీ నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీ తో మాత్రమే థియేటర్లు నడుపు కోవాలని పేర్కొంది. ఈ క్రమంలో శనివారం నుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లో తెరుచుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే అసలు విషయానికి వస్తే రేపు ఐదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతాయా లేదా అనే దానిమీద క్లారిటీ లేదు.

రేపు ఐదు సినిమాలు
ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు, తేజ సజ్జ హీరోగా నటించిన ఇష్క్ అలాగే నరసింహపురం, త్రయం, పరిగెత్తు పరిగెత్తు అనే అయిదు సినిమాలు రేపు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో అయితే పూర్తి స్థాయిలో ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా తెలంగాణలో అన్ని ఆటలు నడిచే అవకాశం కనిపిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లను నడుపుకోవాలని చెప్పడమే కాక రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే థియేటర్లలో రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎగ్జిబిటర్ల సంఘం సమావేశం
దానికి తగ్గట్టు ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సినీ ఎగ్జిబిటర్లు సంఘం సమావేశం అయింది. ఈ సమావేశంలో జీవో నెంబర్ 35 కారణంగా వస్తున్న ఇబ్బందులు మీద చర్చించారు. ప్రభుత్వ పెద్దలను కలిసి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ మాజీ సెక్రటరీ ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే ఈ అంశం మీద మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని కానీ మొన్న ప్రభుత్వం ఇచ్చిన జీవో వలన థియేటర్ లు నిర్వహించలేని పరిస్థితికి వచ్చామని అన్నారు.

ఐదు పది రూపాయలకు సినిమాలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎదురు పెట్టుబడులు పెట్టాలని అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే ఐదు పది రూపాయలకు సినిమాలు చూపించాలని అంటున్నారని అందుకే ఈ జీవో వలన కలిగే నష్టాలు అన్నింటినీ ప్రభుత్వానికి వివరిస్తామని చెప్పారు. సీఎం జగన్ తమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

సినీ పెద్దలే ఆలోచించాలి
ఇక ఓటీటీల విషయంగా మాట్లాడుతూ నిర్మాతలు తమ సినిమాలను ప్రదర్శించుకునేదుకు థియేటర్లు, ఓటీటీలు అంటూ అనేక మార్గాలు ఉన్నాయని కానీ ఎగ్జిబిటర్లు సినిమా థియేటర్ లను మాత్రమే నమ్ముకున్నామని అన్నారు. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా సరే సిల్వర్ స్క్రీన్ కి ఉన్న నిండుదనం మరెక్కడా రాదని అందుకే ఓటీటీలో రిలీజ్ చేసే విషయం గురించి నిర్మాతలు కూడా పునరాలోచించాలని కోరుతున్నామని అన్నారు. కొత్త కొత్త అవకాశాలు అందుబాటులోకి రావడం స్వాగతిస్తామని అయితే థియేటర్ల మనుగడ కొనసాగేలా సినీ పెద్దలు ఆలోచన చేయాలని వారు కోరారు.


Click it and Unblock the Notifications











