Maa Electionsలో ట్విస్ట్..మేనిఫెస్టో రిలీజ్ చేసి నామినేషన్ ఉపసంహరించుకున్న సీవీఎల్.. అసలు ఏమైంది?
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ముందు నుంచి ఏకంగా ఐదుగురు అభ్యర్థులు పోటీకి దిగుతామని ప్రకటించగా ఇప్పుడు ఆ విషయంలో అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ వాదంతో తాను మా అధ్యక్ష బరిలో దిగుతున్నానని ప్రకటించి కలకలం రేపిన సీవీఎల్ నరసింహ రావు ఇప్పుడు వెనక్కు తగ్గారు. అసలు ఏమైంది? ఆయన ఎందుకు వెనక్కు తగ్గారు ? అనే వివరాల్లోకి వెళితే

ఐదుగురి నుంచి ఇద్దరికీ
తెలుగు సినిమా నటీనటులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ముందు తీవ్రమైన పోటీ నెలకొంది. ముందుకు ముందే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాక ముందే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, జీవిత రాజశేఖర్ తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా కాస్త లేటుగా బరిలోకి దిగిన సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు అయితే తనకు ఎలాంటి ప్యానెల్ లేదని స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

తెలంగాణ వాదం
ఇప్పుడు జరుగుతున్న వివాదాల కారణంగా తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్న ఆయన మరీ ముఖ్యంగా తెలంగాణ-ఆంధ్ర అనే అంశాన్ని ఫోకస్ చేసారు. తెలంగాణ వాదంతో తాను ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన అసోసియేషన్ ని విభజించాలని డిమాండ్ చేశారు. 18 మంది కార్యవర్గ సభ్యులు ఉంటే అందులో తొమ్మిది మంది తెలంగాణ కళాకారులు తొమ్మిది మంది ఆంధ్ర కళాకారులకు సమంగా అవకాశం కల్పించాలని కోరారు. అంతే కాక అయన రాముడి భక్తుడు కావడంతో ఆయన తననే గెలిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేయడం కూడా ఆసక్తిరేపింది.

బండ్ల కూడా?
అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో జీవిత రాజశేఖర్, హేమ ప్రకాష్ రాజ్ కి మద్దతు పలికి ఆయన ప్యానల్ లోనే పోటీకి దిగారు. ఈ వ్యవహారంలో జీవిత ఈ ప్యానల్ లో చేరడం తనకు నచ్చలేదని చెబుతూ బండ్ల గణేష్ బయటకు వచ్చి జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ వేశారు. ప్రకాష్ రాజ్ తదితరుల బ్రెయిన్ వాష్ తో బండ్ల గణేష్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

ఎందుకు వెనక్కు?
ఇక ఎలా అయినా పోటీలో ఉండి తీరుతారని భావించిన సీవీఎల్ నరసింహారావు నామినేషన్ వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. నిజానికి ఈ ఉదయం మా అధ్యక్ష ఎన్నికల మేనిఫెస్టో ను ప్రకటించారు నటుడు సీవీఎల్ నరసింహారావు. 2011 సంవత్సరం లో 'మా' పాస్ చేసిన రిజల్యూషన్ ను తాను ఎన్నికైతే... పర్ఫెక్ట్ గా అమలు చేస్తానని.. ఇది కనుక అమలు అయితే ఆర్టిస్టుల అందరికీ అవకాశాలు వస్తాయని సివిఎల్ నరసింహారావు తెలిపారు.

ఎన్నికైతే అంతే
ఈ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు 50 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అనుకున్నామని తాను ఎన్నికయిన వెంటనే వాళ్ల పేర్లు ఎనౌన్స్ చేస్తానని ప్రకటించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి మా సభ్యుడికి 3 లక్షల రూపాయలు సంవత్సరానికి వుండేలా ఆ అమౌంట్ 'మా' కడుతుందని, ... అది వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని ఆయన వెల్లడించారు.

మేనిఫెస్టో
ఇక ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో మా మెంబర్ కి అసోసియేట్ మెంబర్ షిప్ సంపాదించేలా చేస్తానని పేర్కొన్నారు. ఇక పెన్షన్ ప్రస్తుతం 6 వేలు ఇస్తున్నారు. ఈ నవంబర్ నుండి అది 10 వేలు ఇచ్చేలా చేస్తానని ఆయన ప్రకటించారు. ఆడవాళ్లకు ఉపయోగపడే 'ఆసరా'ను 20 ఏళ్ల క్రితం పెట్టామని... మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తామని ప్రకటించారు. ఆసరా కమిటీ లో వుండే 13 మంది పేర్లను తాను ఎన్నికైన వెంటనే ఎనౌన్స్ చేస్తానని... ఎవరైనా మా సభ్యుడు ఆకలి భాధలు పడుతుంటే అతను కాల్ చేసిన రెండు గంటలలో అతని ఇంటికి నెల రోజులకు సరిపడా గ్రాసరి పంపిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇంత ప్రకటించాక అయన గట్టి పోటీ ఇస్తారని అందరూ భావించారు.

అందుకే ఉపసంహరించుకున్నా
కానీ అనూహ్యంగా ఆయన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. తాను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవి కి పోటీ లో నామినేషన్ వేశానని, ఇప్పుడు నామినేషన్ నీ ఉపసంహరించు కున్నానని ఆయన ప్రకటించారు. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా వారికి చెపుతానన్న ఆయన ఉదయం కూడా నా మానిఫెస్టో ను ప్రకటించానని అన్నారు. నేను నామినేషన్ ఉపసంహరించ దానికి కారణం వుందని, అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం అని అన్నారు. ఇక ఇప్పుడు పోటీ లో వున్న రెండు ప్యానెల్స్ లో ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వడం లేదని ఆయన ప్రకటించారు.


Click it and Unblock the Notifications











