సినీ పరిశ్రమలో మరో విషాదం: ఘంటశాల కుమారుడు రత్నకుమార్ కన్నుమూత
కరోనా ప్రభావంతో దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సినిమా షూటింగులు ఆగిపోవడంతో చాలా మంది ఫిల్మ్ మేకర్లు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటుండగా.. కొంత మంది ప్రాణాలనే కోల్పోతున్నారు. ఇలా కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మహమ్మారి బారిన పడి ఇప్పటికే ఎంతో మంది మరణించగా.. పలు కారణాలతో మరికొందరు మృతి చెందారు. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ లెజెండరీ సింగర్ ఘంటశాల వెంకటేశ్వర్రావు కుమారుడు రత్నకుమార్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు.
సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తోన్న ఘంటశాల రత్నకుమార్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. దీని కోసం తరచూ డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. దీనికి చికిత్స తీసుకోవడంతో నాలుగు రోజుల క్రితమే నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడి వైద్యులు స్పందించినప్పటికీ ఆయన మరణించినట్లు సమాచారం.

తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ చాలా కాలంగా ఘంటసాల రత్నకుమార్ చిత్ర పరిశ్రమలో విశేషంగా రాణిస్తున్నారు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వచ్చిన ఎన్నో చిత్రాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్తో పాటు దక్షిణాదికి చెందిన అర్జున్, కార్తీక్, అరవింద్ స్వామికి ఎక్కువగా డబ్బింగ్ చెప్పారు. అలాగే, 'ఆట ఆరంభం', 'వీరుడొక్కడే', 'అంబేద్కర్'తో పాటు 30కిపైగా సినిమాలకు మాటలు అందించారు.


Click it and Unblock the Notifications











