కరోనా వైరస్ను పారదోలుదాం.. హీరో రామ్, నిర్మాత స్రవంతి రవికిషోర్ ఉగాది విషెస్
యావత్ ప్రపంచం ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలి. శార్వరి నామ సంవత్సరం అన్ని విధాలా అందరికీ కలిసిరావాలి అని ప్రముఖ నిర్మాత, స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిశోర్ అన్నారు. ఆయన ప్రస్తుతం రెడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా నటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినీ పరిశ్రమ షట్డౌన్ అయిన విషయం తెలిసిందే.
స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ప్రస్తుతం మానవాళి కరోనా వైరస్తో యుద్ధం చేస్తోంది. ప్రపంచమంతా సంక్షోభంలో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే సంస్కృతి మనది. ఎవరికి వారై ఉంటూ, కలిసికట్టుగా కరోనా వైరస్ను పారదోలుదాం. ఈ నూతన సంవత్సరంలో చీకటిని తరిమి కొత్త వెలుగులను ఆహ్వానిద్దాం... ఆస్వాదిద్దాం! మనిషి ఆనందంగా ఉంటేనే వినోదం వైపు దృష్టి మళ్లుతుంది. కరోనా గురించి ప్రజానీకం కంగారు పడుతున్న ఈ తరుణంలో వినోదాన్ని వాయిదా వేద్దాం. పరిస్థితులన్నీ కుదురుకున్నప్పుడు సినిమాల సంగతిని ప్రస్తావించుకుందాం. అప్పటిదాకా అందరి క్షేమమే మా కాంక్ష అని చెప్పారు.

ఇక రెడ్ సినిమా విషయానికి వస్తే.. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత యువ హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం రెడ్. ప్రస్తుతం యూరప్లోని అద్భుతమైన లోకేషన్లలో షూటింగ్ జరుపుకొన్నది. ఇటలీలోని పర్వత తీరప్రాంతంలో అందాలకు నిలయమైన డొలమైట్స్ ప్రాంతంలో రెడ్ సినిమా పాటలను చిత్రీకరించారు. గతంలో ఈ ప్రాంతంలో పలు హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం గమనార్హం.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు
సంగీతం: మణిశర్మ,
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి,
ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: పీటర్ హెయిన్స్,
ఎడిటింగ్: జునైద్,
సమర్పణ: కృష్ణ పోతినేని,
నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్,
దర్శకత్వం : కిశోర్ తిరుమల.


Click it and Unblock the Notifications











