‘Mohan Babu పొలిటికల్ రీ ఎంట్రీ.. వైఎస్ జగన్పై అసంతృప్తి.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ?’
తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడు, నిర్మాత మోహన్ బాబు రాజకీయ ప్రవేశంపై పలు రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే మోహన్ బాబు మాత్రం తన రాజకీయ రీ ఎంట్రీపై చాపకింద నీరులా పావులు కదుపుతున్నాడనేది రాజకీయ వర్గాలు, నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీతో మోహన్ బాబు సన్నిహితంగా ఉంటున్నారనే విషయం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే మోహన్ బాబు చిత్తూరు జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ దిగుతున్నారనే విషయాన్ని ప్రముఖ రాజకీయవేత్త గోనే ప్రకాశ్ రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం సెన్సేషనల్గా మారింది. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే?

గతంలో రాజ్యసభలో ఎంపీగా
దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలుగుదేశం పార్టీకి మోహన్ బాబు విశేషంగా సేవలందించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా ఏళ్లు తనవంతుగా సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా టీడీపీ నుంచి రాజ్యసభకు పంపించారు. అయితే టీడీపీలో, ఏపీ రాజకీయాల్లో మారిన సమీకరణాల కారణంగా చంద్రబాబుకు, టీడీపీకి మోహన్ బాబు దూరంగా ఉంటూ వచ్చారు.

చంద్రబాబుతో సన్నిహితంగా
తిరుపతికి సమీపంలో నిర్మించిన సాయిబాబా ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇటీవల చంద్రబాబు, మోహన్ బాబు భేటీ అయ్యారు. అంతకుముందే చంద్రబాబుతో, టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారనే విషయం మీడియాలో హైలెట్ అయింది. అయితే రాజకీయాల ప్రస్తావన వద్దంటూ మోహన్ బాబు వారిస్తూ వస్తున్నారు.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి
ఇలాంటి పరిస్థితులు, వార్తల మధ్య తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ గోనే ప్రకాశ్ రావు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు రాజకీయ ప్రవేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి మోహన్ బాబు పోటీ చేసేందుకు ప్రణాళిక సిద్దమైంది అని గోనే ప్రకాశ్ రావు తెలిపారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోటీకి సిద్దం
చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు 1978లో గెలిచారు. 1983లో చంద్రబాబు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి టీడీపీ తరఫున చంద్రబాబు సోదరుడు గెలిచారు. ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేడు. ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మోహన్ బాబు పోటీకి నిలబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని గోనే ప్రకాశ్ రావు జోస్యం చెప్పారు.

వైఎస్ జగన్పై అసంతృప్తితో
ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార తీరుతో మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నారు. తల్లి, చెల్లిని తప్పించిన నేపథ్యంలో వైఎస్ జగన్కు మోహన్ బాబు ఓ లెక్క కాదు. వైఎస్ జగన్ కనికరం లేని వ్యక్తి. రాజకీయ అవసరాలు తప్ప వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వరు. ఆ కారణంగానే చంద్రబాబుతో మోహన్ బాబు చేతులు కలిపారు అని వైఎస్ జగన్పై గోనే వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











