పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో తొక్కిసలాట, గాయాలు.. శ్రేయాస్ మీడియాపై పోలీసుల సీరియస్.. కేసు నమోదు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన గందరగోళంపై తెలంగాణ పోలీస్ విభాగం తీవ్రంగా స్పందించింది. ఈవెంట్ను నిర్వహించిన శ్రేయాస్ మీడియాపై కేసు నమోదైంది. భారీగా అభిమానులు తరలి వచ్చిన ఈవెంట్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అయితే శ్రేయాస్ మీడియా పరిమితికి మించి పాసులు జారీ చేశారని, దాంతో అభిమానులు భారీగా పోటెత్తడంతో ఆ ప్రాంతంలోని వారు, వాహనదారులు, ట్రాఫిక్కు భారీగా అంతరాయం కలిగిందనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్టు సమాచారం.

సినీ వర్గాలు, మీడియా వెల్లడించిన ప్రకారం.. 4 వేల పాసులు జారీ చేయాల్సి ఉండగా, సుమారు 40 వేల పాసులు వరకు ప్రింట్ చేయించారని, దాంతో పరిమితంగా నిర్వహించాల్సిన వేడుక రసాభాసగా మారింది. అభిమానుల తొక్కిసలాట, తోపులాట కారణంగా కొందరికి గాయాలు అయ్యాయి. దాదాపు 200 కుర్చీలు కూడా విరిగిపోయాయనే విషయాన్ని మీడియా వర్గాలు ధృవీకరించాయి.
ఇదిలా ఉండగా, గతవారం దర్శకుడు రాజమౌళి ఏర్పాటు చేసిన RRR మీడియా ప్రెస్ మీట్ కూడా గందరగోళంగా మారింది. అయితే మీడియా సమావేశం జరుగుతుండగా, భారీ సంఖ్యలో అభిమానులకు పాసులు జారీ చేయడంతో రసాభాసగా మారింది. సినీ మ్యాక్స్ (పీవీఆర్ బంజారాహిల్స్)లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కారణంగా పలువురు సినీ ప్రేక్షకులు టికెట్ ఉన్నా లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అభిమానుల కోలాహలం, తోపులాట కారణంగా మీడియా ప్రతినిధులు కూడా చాలా కష్టంగా లోనికి వెళ్లాల్సి వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో 7 గంటలకు ప్రారంభం కావాల్సిన RRR మీడియా సమావేశం వాయిదా పడింది. దర్శకుడు రాజమౌళి 9 గంటల ప్రాంతంలో వచ్చి.. మీడియా ప్రతినిధులకు సారీ చెప్పారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ చేసిన నిర్వాకం వల్ల మీడియా సమావేశాన్ని రద్దు చేస్తున్నాం. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చి గందరగోళం సృష్టించారు. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్, రాంచరణ్ను తీసుకొచ్చి రిస్క్ తీసుకోలేం. కాబట్టి మరో రెండు రోజుల్లో మీడియా సమావేశాన్ని నిర్వహిస్తాం అని రాజమౌళి చెప్పారు.
అయితే శనివారం రోజున అంటే డిసెంబర్ 11వ తేదీన రాజమౌళి మళ్లీ ఆలియాభట్, రాంచరణ్, ఎన్టీఆర్, నిర్మాత దానయ్యతో కలిపి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీపై చర్యలు తీసుకొన్నాం. వారిని తొలగించామని వేదికపై రాజమౌళి చెప్పడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











