‘జాతిరత్నాలు’ రాబోతోన్నారు.. ఆసక్టికరమైన పోస్టర్
ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నవీన్ పొలశెట్టిలు ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. కామెడీ చేయడంలో ఎవరి శైలి వారిదో. ఈ ముగ్గురూ తెరపై తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాంటి ఈ ముగ్గురిని జాతి రత్నాలు పేరిట తెలుగు ప్రేక్షకులను కొత్త అనుభూతిని తీసుకొచ్చేందుకు, నవ్వులు పూయించేందుకు వైజయంతీ మూవీస్, స్వప్నా మూవీస్ సిద్దమైంది. మామూలుగా అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్డౌన్ మూలాన మూలకు పడింది.
ఆ మధ్య జాతిరత్నాలు అంటూ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా అది బాగానే వైరల్ అయింది. ముగ్గురు దొంగ ఖైదీలుగా బాగానే ఆకట్టుకున్నారు. జాతిరత్నాలు జైలుకు ఎందుకు వెళ్లారు.. అసలు వారి కథ ఏంటి.. అన్న ఆసక్తిని కలిగించేలా పోస్టర్ను రిలీజ్ చేశారు. తాజాగా మరో పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు హింట్ ఇచ్చారు.

నవీన్ పొలిశెట్టి బర్త్ డే సందర్బంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో జైల్లో ఉన్న నవీన్ పొలిశెట్టి కూడా.. ఎప్పుడు రిలీజ్ రా అయ్యా అంటూ ఎదురుచూస్తున్నట్టు కనిపించింది. అలా ఒకే పోస్టర్లో రెండు భావాలను వచ్చేలా డిజైన్ చేశారు. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులు.... అంటూ బాహుబలి రేంజ్లో బిల్డప్ ఇస్తూ పోస్టర్ను రిలీజ్ చేశారు. మొత్తానికి ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకురాబోతోన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











