Padma Awards 2023 పద్మ అవార్డు గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు
దేశవ్యాప్తంగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మ అవార్డులకు ఎంపికైన సినీ ప్రముఖులకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అభినందించారు. పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో విజేతలను అభినందిస్తూ..

పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద విజ్ఞానాన్ని ఉపదేశించే శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి వారికి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహం. సమతామూర్తి విగ్రహ స్థాపన ద్వారా చినజీయర్ స్వామి నవతరానికి చక్కటి సందేశాన్ని ఇవ్వడమే కాకుండా 'జిమ్స్' సంస్థ ద్వారా విద్య, వైద్య సేవలు అందిస్తున్నారు అని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.
రామచంద్ర మిషన్ ద్వారా అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అధ్యాత్మిక గురువు శ్రీ కమలేశ్ డీ పటేల్ గారిని పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషదాయకం అని పవన్ కల్యాణ్ అభినందించారు.
ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి గారిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందదాయకం. RRR చిత్రం ద్వారా తెలుగు సినిమా పాటకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు అని ప్రశంసించారు.
సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సంఘ సేవకులు డా.సంకురాత్రి చంద్రశేఖర్ గారిని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం సంతోషాన్ని కలిగించింది. పేదలకు ఉచితంగా కంటి వైద్యం, శస్త్ర చికిత్సలు అందించడంతోపాటు ఉచిత విద్య అందించే సేవలు ఎంతో విలువైనవి అని అన్నారు.
తెలంగాణకు చెందిన భాషా శాస్త్రవేత్త శ్రీ బి.రామకృష్ణా రెడ్డి గారికి పద్మశ్రీ పురస్కారం దక్కడం భాషకు ఇచ్చిన పురస్కారమే. ముఖ్యంగా గిరిజన భాషలపై ఆయన చేసిన పరిశోధనలు, నిఘంటువుల రూపకల్పన అమూల్యమైనవి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన శ్రీ సి.వి.రాజు, శ్రీ అబ్బారెడ్డి నాగేశ్వర రావు, శ్రీ ఎం.విజయ గుప్తా, డా.పసుపులేటి హనుమంత రావు, శ్రీ కోట సచ్చిదానంద మూర్తి గార్లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











