Renukaswamy Murder Case: దర్శన్కు బెయిల్ ఎందుకిచ్చారు.. కర్ణాటక హైకోర్ట్ తీర్పుపై సుప్రీం ఆగ్రహం
గతేడాది కర్ణాటకకు చెందిన రేణుకా స్వామి అనే యువకుడు అత్యంత దారుణంగా హత్యకు గురికావడం అతని మృతదేహం లభ్యం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనుక కన్నడ సూపర్స్టార్ దర్శన్ ఉన్నట్లు వార్తలు రావడంతో శాండిల్వుడ్ ఉలిక్కిపడింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో కేసును తీవ్రంగా పరిగణించిన పోలీస్ శాఖ దర్శన్ను అరెస్ట్ చేసింది. ఈ వార్త భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.
రేణుకాస్వామిని క్రూరంగా చంపిన దర్శన్
తనతో సహజీవనం చేస్తోన్న పవిత్ర గౌడ అనే మహిళకు అసభ్య సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడనే అక్కసుతో రేణుకా స్వామిని దర్శన్ అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తన అనుచరులతో కలిసి అత్యంత క్రూరంగా హింసించి రేణుకా స్వామిని హత్య చేశాడు హీరో. అక్కడితో ఆగకుండా యువకుడి మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించాడు. ఈ కేసులో దర్శన్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఛార్జ్షీట్ దాఖలు
కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు దర్శన్ తదితరులను తరలించారు. అయితే అక్కడ దర్శన్కు వీఐపీ మర్యాదలు దక్కుతున్నట్లుగా ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దర్శన్ను బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించింది. తన బిడ్డను దారుణంగా చంపిన వ్యక్తికి జైళ్లో సకల మర్యాదలు దొరుకుతుండటంతో రేణుకా స్వామి తండ్రి విలపించారు. రేణుకా స్వామి హత్య కేసులో మొత్తం 231 సాక్ష్యాలతో .. 3,991 పేజీల ఛార్జీషీటును కోర్టులో దాఖలు చేశారు పోలీసులు.
దర్శన్కు బెయిల్ మంజూరు
ఈ కేసులో బెయిల్ కోరుతూ దర్శన్ పలుమార్లు పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం తిరస్కరిస్తూ వచ్చింది. సమాజాన్ని ప్రభావితం చేయగల స్థానంలో ఉన్న దర్శన్ .. బయటికి వస్తే సాక్ష్యాధారాలను నాశనం చేస్తాడని పోలీసులు చేసిన వాదనతో ఏకీభవించిన కోర్ట్ అతని బెయిల్ పిటిషన్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే అనారోగ్యానికి చికిత్స చేయించుకునేందుకు గాను దర్శన్కు ఆరువారాల బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్ట్. దీంతో నాలుగు నెలల విరామం తర్వాత దర్శన్ బయటికొచ్చారు.
హైకోర్ట్ తీర్పుపై సుప్రీం ఆగ్రహం
అయితే హైకోర్టు తీర్పును బెంగళూరు నగర పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దర్శన్, పవిత్రా గౌడ సహా ఏడుగురికి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని వారు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. దర్శన్కు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించిన విధానంతో తాము ఏకీభవించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే బెయిల్ మంజూరు విషయంలో తామెందుకు జోక్యం చేసుకోకూడదో చెప్పాలని దర్శన్ తరపు న్యాయవాదిని సుప్రీం ప్రశ్నించింది. అనంతరం ఈ కేసు విచారణను జూలై 22కి వాయిదా వేసింది. ఈ పరిణామాలతో దర్శన్ బెయిల్ రద్దు అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దర్శన్ జైలుకెళ్తారా?
బెయిల్పై బయటికొచ్చిన తర్వాత దర్శన్ తన డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. చిత్రీకరణ నిమిత్తం ఐరోపా దేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించకపోవడంతో థాయిల్యాండ్కు వెళ్లారు దర్శన్. ఇంతలో దర్శన్ బెయిల్ రద్దు చేయాలని బెంగళూరు పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం, దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం నేపథ్యంలో దర్శన్ మరోసారి జైలుకు వెళ్తారా అంటూ శాండిల్వుడ్లో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











