ఆ హీరోల కథలు చెప్పబోతున్న ‘రిపబ్లిక్’ టీమ్: రోజుకో కథను చెబుతానన్న సాయి ధరమ్ తేజ్
ఈ మధ్య కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్తో కనిపిస్తున్నాడు మెగా కాంపౌండ్కు చెందిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. చాలా రోజుల పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డ ఈ యంగ్ హీరో.. 'చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ప్రతిరోజూ పండగే' మూవీతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, గత ఏడాది కూడా 'సోలో బ్రతుకే సో బెటర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా సక్సెస్ అవడంతో సాయి ధరమ్ తేజ్ హ్యాట్రిక్ను అందుకున్నాడు.
వరుస హిట్లతో ఫుల్ జోష్తో ఉన్న సాయి ధరమ్ తేజ్ తాజాగా.. విలక్షణ చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు దేవ కట్టాతో 'రిపబ్లిక్' అనే సినిమాను చేశాడు. పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో రాబోతున్న ఈ సినిమాను జూన్ 4న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే దీని చిత్రీకరణను కూడా అంతే వేగంగా పూర్తి చేసేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాల్సిన సమయంలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభించింది. దీంతో ఈ చిత్ర విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే.

కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత 'రిపబ్లిక్' మూవీ విడుదల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా దీన్ని ఓటీటీలో నేరుగా విడుదల చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత చిత్ర యూనిట్ ఆ వార్తలను ఖండించింది. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో 'పంజా అభిరామ్.. జిల్లా కలెక్టర్' అనే నేమ్ బోర్డ్ కనిపిస్తోంది. తద్వారా ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్గా నటిస్తున్నట్లు తెలిపారు.
'రిపబ్లిక్' మూవీ యూనిట్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 'Thank You Collector' అనే ప్రచారం ప్రారంభించింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో విడుదలైంది. ఇందులో సాయి ధరమ్ తేజ్ 'సరిహద్దుల్లో నిల్చుని విదేశీ శత్రువుల నుంచి మన దేశాన్ని కాపాడే సైనికులంటే మనకెంతో గౌరవం. వాళ్ల వీరగాథలు ఎన్నో విన్నాం చూశాం. కానీ, స్వదేశీ శత్రువులు మన మీద చేసే అన్యాయాల దాడి నుంచి కాపాడడానికి ప్రతిరోజూ కలెక్టర్లు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటంలో జయించిన వారు ఉన్నారు. అందులో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. అలాంటి కలెక్టర్లను గుర్తించి.. 'Thank You Collector' అనే కార్యక్రమం ద్వారా వాళ్ల కథలను మీ ముందుకు తీసుకు రాబోతున్నాం' అని అందులో తెలిపాడు.
పొలిటికల్ బ్యాగ్డ్రాప్తో కొల్లేరు సరస్సు సమస్యల నేపథ్యంలో రూపొందిన 'రిపబ్లిక్' మూవీలో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పంజా అభిరామ్గా నటిస్తున్నాడు. తన ఉద్యోగాన్ని వదిలేసి హీరో ప్రజల కోసం పోరాటం చేయడం అనే కాస్సెప్టుతో ఇది రూపొందిందట. ఇక, ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ముఖ్యమంత్రి పాత్రను చేస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











