‘గాడ్సే’గా మారిన విలక్షణ నటుడు సత్యదేవ్: మళ్లీ కలవడం సంతోషంగా ఉందని ట్వీట్
విలక్షణ నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ టాలెంటెడ్ సత్యదేవ్. ప్రభాస్ నటించిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాతో టాలీవుడ్లోకి ప్రవేశించిన అతడు.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మీ' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. దీంతో అతడికి ఎన్నో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సత్యదేవ్ నటించబోయే కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది.
'బ్లఫ్ మాస్టర్' వంటి సరికొత్త కథాంశంతో తీసిన సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు గోపీ గణేష్. ఈ సినిమా తర్వాత అతడు మరోసారి సత్యదేవ్తో సినిమా చేయబోతున్నాడు. అదే.. 'గాడ్సే'. సీకే స్క్రిన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఓ పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. అందులో సత్యదేవ్ వైల్డ్ లుక్లో కనిపిస్తున్నాడు. అతడి చేతి దగ్గర మందు గ్లాసుతో పాటు వెనకాల పెద్ద గన్ కూడా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఇక, 'గాడ్సే' సినిమా గురించి తన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన హీరో సత్యదేవ్.. 'బ్లఫ్ మాస్టర్ తర్వాత గోపీ గణేష్ అన్నతో పని చేయబోతున్నా. మా ఇద్దరి కలయికలో 'గాడ్సే' మూవీ రాబోతుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుంది' అని అందులో పేర్కొన్నాడు. గత ఏడాది 'ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య'తో భారీ విజయాన్ని అందుకున్నాడు సత్యదేవ్. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ తర్వాత అతడిని సినీ పెద్దలంతా అభినందించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











