టాలీవుడ్లో మరో విషాదం: షూటింగ్లో గాయం.. సంక్రాంతికి ఇంటికెళ్లి కన్నుమూత
కొంత కాలంగా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది గొప్ప గొప్ప ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఇలా సినీ రంగంతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. మరీ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ చాలా మంది పెద్ద పెద్ద నటులతో పాటు చిన్న ఆర్టిస్టులు కూడా చనిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తున్న శ్రీను అలియాస్ కొంచాడ శ్రీనివాస్ కన్నుమూశారు.
చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. దాదాపు యాభైకి పైగా చిత్రాలు.. పదికి పైగా సీరియళ్లలో నటించిన కొంచాడ శ్రీనివాస్ (47) బుధవారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతోన్న ఆయన.. సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు తన స్వగ్రామం అయిన శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గకు వెళ్లారు. అక్కడ పండును ఆహ్లాదభరితంగా జరుపుకున్న తర్వాత ఆయనకు ఒక్కసారిగా గుండెనొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచినట్లు తెలుస్తోంది.

కొంచాడ శ్రీనివాస్ ఆ మధ్య ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో చిన్న ప్రమాదం జరిగిందట. ఓ స్టంట్ చేస్తున్న సమయంలో అతడు కింద పడిపోయాడని, అప్పుడు ఛాతికి బలమైన గాయం తగిలినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి శ్రీనివాస్ గుండె సంబంధింత సమస్యతో బాధ పడుతున్నాడని వెల్లడించారు. అలా ఇప్పటికే పలుమార్లు అతడికి కొన్ని ఆరోగ్య సమస్యలు బయట పడినట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఈ సీనియర్ యాక్టర్ను చాలా ఆస్పత్రుల్లో చూపించామని కూడా కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే, ఈ మధ్య కాలంలో అతడు చాలా యాక్టివ్గా కనిపించాడని, పండుగకు కూడా సందడిగా ఉన్నాడని కూడా తెలిపారు.
శ్రీను అలియాస్ కొంచాడ శ్రీనివాస్ మరణ వార్తతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది. ఆయనకు సన్నిహితులైన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించారు. అందులో 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'నచ్చావులే', 'ప్రేమ కావాలి', 'ఆ ఇంట్లో' వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలాగే, కొన్ని సీరియళ్లలోనూ మంచి పాత్రలను చేయడంతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువ అయ్యారు.
శ్రీను అలియాస్ కొంచాడ శ్రీనివాస్ తండ్రి ఐదేళ్ల క్రితమే కన్నుమూశారు. అలాగే, అతడి తమ్ముడు కూడా పది సంవత్సరాల క్రితం చనిపోయాడు. అతడికి ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. ఇదిలా ఉండగా.. శ్రీను సంపాదనపైనే తమ కుటుంబం ఆధారపడి ఉండేదని, ఇప్పుడు ఆయన మరణంతో తమకు ఇబ్బందులు వచ్చాయని తల్లి విజయలక్ష్మి వాపోతున్నారు. పరిశ్రమకు చెందిన వాళ్లు ఎవరైనా తమకు సహాయం చేయాలని ఆమె అభ్యర్థిస్తున్నారు.


Click it and Unblock the Notifications











