రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సిరివెన్నెల!
టాలీవుడ్ దిగ్గజ గేయ రచయితలలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకరు. ఎన్నో మధురమైన గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. సిరివెన్నెల పాటలు మధురానుభూతిని కలిగించేలా, తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయి. లోతైన భావంతో, అచ్చ తెలుగు పదాలతో పాటలు రాయడంలో సిరివెన్నెల ఆయనకు ఆయనే సాటి. ఎన్నో చిత్రాల్లో సిరివెన్నెల అందించిన పాటలు హైలైట్ గా నిలిచాయి. సిరివెన్నెల 80, 90 దశకాల్లో అందించిన పాటలు ఇప్పటికే అదే అనుభూతితో అలరిస్తూ ఉంటాయి. ఆ మధ్యన సిరివెన్నెల భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా నేడు(శనివారం) రాష్ట్రపతి భవన్ లో జరిగిన పద్మ అవార్డుల వేడుకలో సిరివెన్నెలరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల ఫోటోలని ఆయన శిష్యుడు, ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గురువుగారు పద్మశ్రీ అందుకున్నారు అని కామెంట్ పెట్టారు.

సిరివెన్నెల సాహిత్య రచయితగా 1984లో కెరీర్ ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన 11 నంది అవార్డులు అందుకోవడం విశేషం. సిరివెన్నెల కీర్తి కిరీటంలో ఇప్పుడు పద్మశ్రీ కూడా చేరింది. ఆయన పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నారు అనే వార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











