మణికట్టు తెగ్గొట్టుకుని రక్తం కారుతూ ఖైదీ సినిమా..శ్రీదేవి సోడా సెంటర్ నేలటికెట్టులో చూస్తే కిక్కే వేరు!
నేల టిక్కెట్టులో శ్రీదేవి సోడా సెంటర్ చూస్తా అంటూ ఆ సినిమా దర్శకుడు కరుణ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రేక్షకులను సినిమా థియేటర్లకు రప్పించడానికి సినిమా దర్శకు నిర్మాతలు కష్టపడుతున్న క్రమంలో కరుణ కుమార్ కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఆయన ఏమన్నారంటే?

జ్ఞాపకాల తుట్ట ఇది
సినిమా థియేటర్ ఒక ఎమోషన్, అని పేర్కొన్న కరుణ కుమార్ చిన్నప్పుడు అమ్మ నాన్నల ఒడిలో కూర్చొని చూసిన మొదటి సినిమా దగ్గర నుండి ఇప్పుడు నా పిల్లలతో కలిసి పాప్ కార్న్ తింటూ, జోకులేసుకుంటూ చూసే సినిమా థియేటర్ నా హృదయానికి దగ్గరగా ఉంటుందని అన్నారు. నేను సినిమావాడ్నయ్యాక రెండో సినిమా కూడా తీసేసాక... నా రెండో సినిమా శ్రీదేవి సోదా సెంటర్" కటౌట్ ను నా ఊరు పలాసలో వెంకటేశ్వర థియేటర్ దగ్గర చూసుకున్నప్పుడు కదిలిన జ్ఞాపకాల తుట్ట ఇది అంటూ ఆయన జ్ఞాపకాల దొంతరను కదిలించారు.

జ్ఞాపకాల తుట్ట ఇది
ఖైదీ నంబర్ 786 సినిమా. అప్పటికి పలాసలో మూడు థియేటర్లు ఉన్నాయి. వెంకటేశ్వరలో సినిమా రిలీజ్ ఇక్కడ మెగాస్టార్ డై హార్డ్ ఫ్యాన్, సినిమా ఇంకో పదిహేను రోజుల్లో వస్తుందంటే అమ్మ దగ్గర, నాన్న దగ్గర తల గోక్కుంటూ నిలబడి, నాన్న కాళ్లు పట్టి. అమ్మ వంట గదిలో దాచిన డబ్బుల్లో కొంచెం దొంగలించి ఒక రూపాయిన్నర కూడ పెట్టుకోవాలి. రూపాయి టిక్కెట్టుకు అర్ధరూపాయి ఇంటర్వెల్ లో గురుమూర్తి అమ్మే బాద్ షా, జిలేబి ఆ తర్వాత ఒక సోడా కొనుక్కోవడానికి అంటూ ఆయన రాసుకొచ్చారు.

జాతర జరుగుతున్నట్లు జనం
ఒక్కడినే సిన్మాకు వెళ్లలేను. వెళ్లినా అక్కడున్న జనం మధ్యలో దూరి టిక్కెట్టు సంపాదించలేను. అప్పుడు నాకు గుర్తొచ్చే పహిల్వాన్ మా కృష్ణన్నయ్య అని ఆయన గుర్తు చేసుకున్నారు. మా కృష్ణన్నయ్య సిన్మా రిలీజ్ రోజు తొమ్మిది కిలోమీటర్లు ఎండలో నడచుకుంటూ వచ్చేవాడు మా అమ్మ పెట్టిన చద్దన్నం తిని పడుకుంటే మాట్నీకు టైమౌవుతుందని నేను వాడిని లేపుతూ నస పెట్టేవాడిని. ఒంటిగంటకు బయలుదేరి థియేటర్ కి వెళ్తే జాతర జరుగుతున్నట్లు జనం ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు.

మణికట్టును తెగ్గొట్టుకుని రక్తం కారుతూ
రూపాయి టిక్కెట్టు కౌంటర్ దగ్గర టిక్కెట్టు కోసం మర్డర్ చెయ్యడానిక్కూడా వెనకాడని చిరంజీవి ఫ్యాన్స్ ఉండేవారు. ప్రతి సినిమాకి ఇదే తంతని, ఖైదీ నెంబర్ 786 జ్ఞాపకం మాత్రం మర్చిపోలేనిది, ఆ రోజు ఎప్పటిలాగే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా మా కృష్ణన్నయ్య లోనికి చొరబడి, చొక్కా చిరిగి కుడి చేయ్యి మణికట్టును తెగ్గొట్టుకుని రక్తం కారుతూ ఉంటే, విజయ గర్వంలో రెండు టిక్కెట్టులతో బయటకొచ్చాడని రక్తం కారుతున్న చేతిని బోరింగ్ దగ్గర కడిగి నేలమీద ఉన్న మట్టి రాసి పరిగెత్తుకుంటూ వెళ్లి సినిమా చూశాం అని చెప్పుకొచ్చారు.

ఎప్పటికీ మర్చిపోలేనిది
జనం, ఈలలు, ఉక్క, చెమట... తెరమీద చిరంజీవి... గువ్వా గోరింక పాట... ఎప్పటికీ మర్చిపోలేనిదని ఆయన చెప్పుకొచ్చాడు. అదే వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఇప్పుడు మన బొమ్మ కటౌట్ ను చూసుకోమని ఫ్రెండు ఫొటో పంపించాడు అని అన్నారు. ఆ కటౌట్ ను, ఆధునికరించబడిన వెంకటేశ్వర థియేటర్ ను చూసాక చాలా గుర్తొచ్చింది. భావోద్వేగం కలిగిందని అన్నారు.
Recommended Video

నేల టిక్కెట్టు ఉందో లేదో ?
శ్రీదేవి సోడా సెంటర్ ను నేలటిక్కెట్టులో కూర్చొని శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో చూడాలని ఉంది. నేను త్వరలో వస్తున్నా నేల టిక్కెట్టు ఉందో లేదో ? లేకపోతే ఫస్ట్ రోలో కూర్చొని చూస్తా. నేలటిక్కెట్టులో శ్రీదేవిసోడా సెంటర్ చూస్తే వచ్చే ఆ కిక్కే వేరని ఆయన ఉద్వేగంగా రాసుకొచ్చారు. ఇక సుదీర్ బాబు-ఆనంది హీరో హీరోయిన్లుగా 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది. మరి చూడాలి పలాస సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు రెండో సినిమాతో ఏం మ్యాజిక్ చేయనున్నాడు అనేది.


Click it and Unblock the Notifications











