సుశాంత్ కేసులో సాక్ష్యాలు తారుమారు, దర్యాప్తులో లోపాలు..సీనియర నటి, ఎంపీ ఫైర్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై జరుగుతున్న దర్యాప్తుపై సీనియర్ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ సంచలన ఆరోపణలు చేశారు. మరణం తర్వాత పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కేసు విషయంలో ముంబై పోలీసులు అనుసరిస్తున్న తీరులో చాలా లోపాలు ఉన్నాయని ఆమె ఆరోపణలు చేశారు. సుశాంత్ మరణం వెనుక వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ దర్యాప్తు అవసరమని డిమాండ్ లేస్తున్న సమయంలో రూపా గంగూలీ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. రూపా గంగూలీ గురించి, ఆమె చేసిన ట్వీట్ల గురించి వివరాల్లోకి వెళితే..
Recommended Video

ద్రౌపది పాత్రతో సుపరిచితులు
రూపా గంగూలీ నటిగా కంటే మహాభారతం సీరియల్లో ద్రౌపదిగా అందరికి సుపరిచితులు. ద్రౌపది పాత్రతో బుల్లితెర మీద ఆమె అందాలు, హావభావాలు కోట్లాది మంది అభిమానులను ఆమె సంపాదించుకొన్నారు. ఆ తర్వాత నటిగా, గాయనిగా, రాజకీయ వేత్తగా విభిన్నమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా సుశాంత్ రాజ్పుత్ సూసైడ్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు.

సుశాంత్ మృతి దర్యాప్తుపై అనుమానాలు
తాజాగా ట్విట్టర్లో వరుస ట్వీట్లతో రూపా గంగూలీ ఫైర్ బ్రాండ్గా మారారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను కొందరు అనుమానాస్పద రీతిలో ఆపరేట్ చేస్తున్నారు. ఆ అకౌంట్ నుంచి కొన్ని పోస్టులను డిలీట్ చేస్తున్నారు. ఆ అకౌంట్లో దర్యాప్తుకు అవసరమయ్యే సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు అంటూ రూపా గంగూలీ తన ట్విట్టర్లో పోస్టు చేసిన ఓ వీడియోలో ఆరోపించారు.

రూపా గంగూలీ వరుస ట్వీట్లు
సుశాంత్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని సాక్ష్యాలను నాశనం చేస్తున్నారనే విషయం నా దృష్టికి వస్తే మొదట నమ్మలేదు. కానీ తర్వాత కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని నా వద్ద పెట్టుకొన్నాను. ఆ తర్వాత జరుగుతున్న మార్పులు చూసి షాక్ తిన్నాను. ఇలాంటి అనుమానాస్పదమైన కేసులో సీబీఐ దర్యాప్తు మొదలవుతుంది? సాక్ష్యాలన్నీ రూపుమాపిన తర్వాత సీబీఐ రంగంలోకి దూకుతుందా? అంటూ రూపా గంగూలీ ప్రశ్నల వర్షం కురిపించారు.

సీబీఐ విచారణకు డిమాండ్
సుశాంత్ మరణం తర్వాత చోటుచేసుకొంటున్న పరిణామాలను చూస్తుంటే నిజంగా ఈ కేసులో ఏదో జరగకూడనిది జరుగుతుందనే అనుమానం కలుగుతుంది. ఈ కేసు విచారణలో పారదర్శకత్వ కావాలి. సీబీఐ ఎప్పుడు జోక్యం చేసుకొంటుంది? అనే ప్రశ్నలను సంధిస్తూ #cbiforsushant అనే ట్యాగ్ను ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు.

ఫోరెన్సిక్ నిపుణుల తీరుపై అనుమానం
సుశాంత్ మరణం తర్వాత ఫొరెన్సిక్ బృందం వ్యవహరించిన తీరుపై కూడా రూపా గంగూలీ మండిపడ్డారు. సుశాంత్ 14వ తేదీన మరణిస్తే ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్లు జూన్ 15వ తేదీన నింపాదిగా వచ్చారు. సాక్ష్యాలు కనుమరుగైపోయిన తర్వాత ఆధారాలు సేకరిస్తారా అని ఆమె ఫైర్ అయ్యారు. ఫొరెన్సిక్ నిపుణుల పనితీరు నాకు తెలియదు గానీ, ఎన్నో ఏళ్లు ఫొరెన్సిక్ పరిశోధనలో పనిచేసిన ఓ ప్రొఫెసర్ చెప్పిన ప్రకారం ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు.

సుశాంత్ సూసైడ్పై సందేహాలు
సుశాంత్ సూసైడ్పై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎవరైనా జీవితాన్ని ముగించాలనుకొన్నప్పుడు ఒంటరిగా ఉండిపోతాడు. కానీ తీవ్రమైన నిర్ణయం తీసుకొనే ముందు ఓ వ్యక్తి రాత్రంతా ఎంజాయ్ చేసి.. ఉదయమంతా హ్యాపీగా కనిపించిన వ్యక్తి అలాంటి చర్యకు పాల్పడుతారా? ఇలాంటి విషయాలన్నీ చూస్తే కొన్ని విషయాలకు పొంతన ఉండటం లేదు అని రూపా గంగూలీ అన్నారు.

వేలి ముద్రలు తారుమారు చేయలేమా?
మరణం గానీ, హత్య గానీ జరిగినప్పుడు సీన్కు సంబంధించిన సమాచారంపై సరైన క్లారిటీ రాబట్టుకోవడం పౌరులకు సాధ్యం కాదా? సంఘటనా స్థలంలో వ్యక్తుల వేలిముద్రలు సేకరించడం సాధ్యపడదా? అలాంటి విషయాలను తారుమారు చేయవచ్చనే విషయం అందరికీ తెలియదా అని రూపా గంగూలీ ప్రశ్నించారు. సుశాంత్ది సహజ మరణం కాదు.. బలమైన అనుమానాలు ఉన్నాయనే సందేహాన్ని రూపా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











