సీబీఐ చేతికి సుశాంత్ కేసు.. మొదటి అడుగుపడింది.. అంకిత, అక్షయ్ కుమార్ సెన్సేషనల్ ట్వీట్స్
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. మొదటి బాలీవుడ్ మాఫియా, నెపోటిజం అంటూ వివాదాలు తెరపైకి వచ్చాయి. ఆ తరువాత అనూహ్యంగా సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగిసింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేయడంతో మొత్తం వ్యవహారం మారిపోయింది. ఈ కేసు ఇక రెండు రాష్ట్రాల మధ్య చిచ్చును పెట్టింది. అది చివరకు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. నేడు విచారణ జరగ్గా అత్యున్నత న్యాయ స్థానం సంచలన తీర్పు ఇచ్చింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Recommended Video

రెండు రాష్ట్రాల మధ్య..
జూన్ 14న సుశాంత్ తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నాడని బాంద్రా పోలీసులు నిర్దారించారు. అయితే సుశాంత్ది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఈ విషయంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని మొదటి నుంచి వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు నమోదు చేయడంతో ఇది మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మధ్య చిచ్చును పెట్టింది.

రియా చుట్టూ బిగుసుకున్న ఉచ్చు..
సుశాంత్ మరణానికి రియానే కారణమంటూ, అతని వద్ద నుంచి డబ్బులు కాజేసింది, డిప్రెషన్కు గురి చేసింది అంటూ ఇలా పలు ఆరోపణలో సుశాంత్ తండ్రి పాట్నాలో ఫిర్యాదు చేశాడు. దీంతో సుశాంత్ కేసు మహారాష్ట్ర నుంచి పాట్నాకు వచ్చింది. అయితే పాట్నా పోలీసులకు బాంద్రా పోలీసులు సాయం నిరాకరించడం, రియా కూడా కేసును మహారాష్ట్రకు బదిలీ చేయించమని పిటీషన్ను దాఖలు చేయడం వంటివాటిపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.

సంచలన తీర్పు..
రియా వాదనలు, మహారాష్ర, బీహార్, సుశాంత్ తండ్రి తరుపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం రియా పిటీషన్ను కొట్టివేసింది. వెంటనే సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి అడుగు పడింది..
సుప్రీం తీర్పు పట్ల సాధారణ జనాలే కాకుండా సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. సుశాంత్కు న్యాయం జరిగే క్రమంలో మొదటి అడుగుపడిందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే ట్వీట్ చేస్తూ.. నిజమే విజయం సాధిస్తుంది.. #1ststeptossrjustice అంటూ పేర్కొంది. ఇక అక్షయ్ కుమార్ స్పందిస్తూ సుప్రీం తీర్పు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నాడు.

తెలుగు వారు కూడా..
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడం టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. మంచు మనోజ్ స్పందిస్తూ.. దేవుడు గొప్ప వాడు.. ఎప్పటికైనా న్యాయమే నిలబడుతుంది అని చెప్పుకొచ్చాడు. నిఖిల్ స్పందిస్తూ.. సుశాంత్ విషయంలో ఏం జరిగిందో మొత్తానికి తెలుసుకోబోతోన్నామని పేర్కొన్నాడు. నిర్మాత రాజ్ కందుకూరి స్పందిస్తూ.. సుశాంత్కు న్యాయం చేసే క్రమంలో సాధించిన గొప్ప విజయం ఇది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించింది. ధర్మమే విజయం సాధిస్తుంది.. సత్యమేవ జయతే అని ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











