బాహుబలి-2 టికెట్స్: ప్రీ బుకింగ్ పేరిట అధిక ధరల బాదుడు!
మరో పదిరోజుల్లో ‘బాహుబలి-2’ మూవీ విడుదల కాబోతోంది. అయితే ఈ సారి బ్లాక్ మార్కెటింగ్ రూపంలో కాకుండా.... కార్పొరేట్ రూపంలో ప్రేక్షకులను బాదడానికి రంగం సిద్ధమైంది.
హైదరాబాద్: 2015లో బాహుబలి-1 విడుదల సమయంలో టిక్కెట్ల కోసం ఎంత గొడవ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టిక్కెట్ల కొనుగోలు వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్. టిక్కెట్ల కోసం.... ఎమ్మెల్యేలు, ఎంపీల రికమండేషన్లు కూడా నడిచాయి.
అప్పట్లో టిక్కెట్లకు ఉన్న డిమాండ్ చూసి బ్లాక్ మార్కెటింగ్ మాఫియా రెచ్చిపోయింది. కొన్ని చోట్ల థియేటర్ల యజమానులే టిక్కెట్లను బ్లాక్ చేయడంపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇక క్యూలైన్లలో తోపులాట లాంటివి జరుగడంతో భారీ బందోబస్తు మధ్య టిక్కెట్లను అమ్మాల్సి వచ్చింది.
కట్ చేస్తే.... ఇపుడు మరో పదిరోజుల్లో 'బాహుబలి-2' మూవీ విడుదల కాబోతోంది. అయితే ఈ సారి బ్లాక్ మార్కెటింగ్ రూపంలో కాకుండా.... కార్పొరేట్ రూపంలో ప్రేక్షకులను బాదడానికి రంగం సిద్ధమైంది.

ప్రీ బుకింగ్స్
ఇప్పటికే ప్రీ బుకింగ్స్ పేరిట కొన్ని కార్పొరేట్ సంస్థలు టిక్కెట్ల అమ్మకాలు మొదలు పెట్టారు. ఒక్కో టిక్కెట్ కు రూ. 40 నుండి 50 అధికంగా బుకింగ్ ఫీజు పేరిట వసూలు చేస్తున్నారు.

టికెట్ గ్యారంటీలేదు
మరి ఇలా బుకింగ్ చేసుకుంటే టికెట్ గ్యారంటీ ఉంటుందా? అంటే అదీ లేదు. తాము కోరుకున్న థియేటర్లలో కోరుకున్న సీట్లో కూర్చుని చూసే అవకాశమూ లేదు. మనం ఎంచుకున్న మూడు థియేటర్ల ఆప్షన్స్ లో ఏదో ఒక థియేటర్లో, వారు ఏ సీటు కేటాయిస్తే ఆ సీట్లో సినిమా చూడాల్సి ఉంటుంది.

ముందే డబ్బు వసూలు
టిక్కెట్ గ్యారంటీ ఇవ్వడం లేదు కానీ... డబ్బులు మాత్రం ముందే వసూలు చేస్తున్నారు. ఉదాహకరణకు రూ. 50 నుండి 200 రేంజిలో మనం టికెట్స్ కావాలని ఆప్షన్ పెట్టుకుంటే.... రూ. 200 వసూలు చేస్తారు. ఏ రేటు టికెట్ మనకు దక్కుతుందో తెలియదు. మిగతాది మనకు రీఫండ్ చేస్తారట.

సామాన్యుడి పరిస్థితి ఏమిటి?
ఇలా టిక్కెట్లన్నీ కార్పొరేట్ వారికి అప్పగిస్తే... సమాన్యుడి పరిస్థితి ఏమిటి? ఒక్కో టికెట్ కు ఇంత భారీగా డబ్బులు వసూలు చేయడం ఏమిటి? అని కామన్ సినీ ప్రేక్షకుడు ప్రశ్నిస్తున్నాడు. అందరికీ అందుబాటులో టిక్కెట్లు ఉంచాలని, థియేటర్ వద్దగానీ, సాధారణ బుకింగ్ చార్జీలతో ఆన్ లైన్లో అమ్మాలని కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











