రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారు
హైదరాబాద్ : ఇతర భాషల్లో వచ్చే సినిమాలపై ఓ కన్నేసి ఉంచుతారు మన తెలుగు దర్శక,నిర్మాతలు. ముఖ్యంగా తమిళంలో భాక్సాఫీస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూంటారు. శుక్రవారం విడుదలైన చిత్రాలలో ఏదైనా హిట్టైతే వెంటనే దానిపై కర్చీప్ వేసేయటానికి ఉత్సాహం చూపిస్తూంటారు. తాజాగా తమిళంలో ఓ చిన్న సినిమా ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. 'మంజా పై'( పసుపు సంచి) టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం మన నిర్మాతలు క్యూ కట్టారని సమాచారం.

రెండు వారాల క్రితం తమిళదర్శకుడు లింగుస్వామి సమర్పించిన ఆ చిత్రం మొదట 80 థియేటర్లలో విడుదలై వారం తిరిగేసరికల్లా థియేటర్ల సంఖ్య అనూహ్యంగా పెంచుకొని ప్రస్తుతం 250 థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.అతి తక్కువ బడ్జెట్లో తయారైన 'మంజా పై' చిత్రం రూ. 20 కోట్లు వసూలు చేస్తుందని చెన్నై ట్రేడ్ టాక్. తాత, మనవళ్ల మధ్య అనుబంధాన్ని సరికొత్త రీతిలో దర్శకుడు రాఘవన్ చూపించిన పద్ధతి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసిందనీ, అందుకే రికార్డ్ స్థాయిలో వసూళ్ల వస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

రాజ్కిరణ్, విమల్, లక్ష్మీమీనన్ ముఖ్య పాత్రలు ధరించిన 'మంజా పై' చిత్రం మీద టాలీవుడ్ ప్రముఖుల దృష్టి పడింది. అనూహ్య విజయం సాధించి బాక్సాఫీసును కొల్లగొడుతున్న ఈ చిత్రం రీమేక్ హక్కులు పొందడం కోసం ప్రముఖ నిర్మాతల్లో పోటీ మొదలైంది. లగడపాటి శ్రీధర్, సూపర్గుడ్ ఫిలిమ్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలు సహా డా.దాసరి నారాయణరావు కూడా ఈ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫాన్సీ రేటు ఆఫర్ చేసి ఎలాగైనా హక్కులు పొందడానికి వీరంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి వీళ్లలో ఎవరు ఈ చిత్రం రైట్స్ సొంతం చేసుకుంటారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











