Pawan Kalyan's OG: బాక్సాఫీస్ని ముంచెత్తనున్న ఓజీ తుఫాన్.. పవన్ మూవీకి బుకింగ్స్ ఎప్పుడంటే?
గత కొద్దినెలలుగా రాజకీయాలు, పాలనతో బిజీగా ఉన్న పవర్స్టార్ పవన్ కళ్యాణ్ జూలు విదిల్చారు. డిప్యూటీ సీఎం అయ్యే నాటికి తను ఒప్పుకున్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లును విడుదల చేసిన పవర్స్టార్.. తాజాగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ అంతు చూసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఓజీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఓజీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఓజీ సినిమా బడ్జెట్ ఎంత?
ఆర్ఆర్ఆర్ వంటి సినిమాను నిర్మించిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

కన్మణిగా ప్రియాంక మోహన్
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇటీవలే హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ను, ఆమె పాత్ర పేరును రివీల్ చేశారు. ఇందులో ఆమె కన్మణి అనే రోల్ పోషిస్తున్నారు. ఆగస్ట్ 24న ఓజీ నుంచి సెకండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ పాట ఎలా ఉంటుందోనని ఉత్కంఠ నెలకొంది.
ప్రీ రిలీజ్ బిజినెస్లో ఓజీ రికార్డ్
ఇకపోతే.. విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్లో దుమ్మురేపుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓజీకి రికార్డ్ బిజినెస్ జరుగుతోందట. నైజాంలో 60 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 70 కోట్ల రూపాయలు, సీడెడ్లో 25 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ రైట్స్ ధర పలుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఓజీ కోసం తెలుగు అభిమానులతో పాటు హిందీ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓజీ రైట్స్ కోసం ఉత్తరాదికి చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారట. దీనిలో భాగంగా ఓజీ శాటిలైట్ రైట్స్కి కళ్లు చెదిరే ధర దక్కినట్లుగా తెలుస్తోంది. పలు టాప్ ఛానెల్స్ ఇందుకోసం పోటీపడగా ఫ్యాన్సీ రేటుకు స్టార్ గోల్డ్ ఛానెల్ ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
సెప్టెంబర్ 25న ఓజీ
సెప్టెంబర్ 25న ఓజీని రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే అదే రోజున నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 కూడా రిలీజ్ అవుతుందని ఆ సినిమా మేకర్స్ తెలిపారు. రెండు భారీ చిత్రాలు ఒకే రోజున విడుదలైతే నిర్మాతలకు నష్టం కలుగుతుందనే వాదనలు రావడంతో బాలయ్య మూవీకి వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 25న ఓజీ సోలో రిలీజ్ కానుంది. అఖండ 2ను డిసెంబర్ 5 లేదా, 12వ తేదీన రిలీజ్ చేస్తారని ఫిలింనగర్లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో తెరపై పవన్ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడంటే?
ఇదిలాఉండగా.. ఓజీకి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో రిలీజ్ కోసం మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఆగస్ట్ 29 నుంచి అమెరికాలో ఓజీకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతుందని, సెప్టెంబర్ 24న ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తామని అమెరికాలో ఓజీకి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తోన్న ప్రత్యంగిరా సినిమాస్ ప్రకటించింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్లో పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











