'గబ్బర్ సింగ్ 2' లో హీరోయిన్ గా ఆమే ఫైనల్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్ 2'. ఈ చిత్రం జనవరి రెండవ వారం నుంచి సెట్స్ మీదకు వెళ్లనుందని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్ గా అసిన్ ని ఎంపిక చేసారని తెలుస్తోంది. అసిన్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గతంలో అన్నవరం చిత్రం వచ్చింది. మళ్లీ ఇంతకాలానికి ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నట్లు సమాచారం. దాంతో టాలీవుడ్కు అసిన్ మళ్లీ వస్తోందా అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లైంది.
అసిన్ ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టిపెట్టినట్టు తెలిసింది. బాలీవుడ్లో వంద కోట్ల కథానాయికగా గుర్తింపు తెచ్చుకొన్న అసిన్కి ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో మళ్లీ దక్షిణాదికి తిరిగొచ్చేయాలని నిర్ణయించుకుందట. తెలుగు, తమిళ భాషల్లో విరివిగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల తెలుగులో పలువురు దర్శకనిర్మాతలకు ఫోన్లు చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని ప్రచారం సాగుతోంది. అంటే అసిన్ని తెలుగు తెరపై మళ్లీ చూడొచ్చన్నమాట.
యూత్ హీరోల సరసన నటించడానికి చాలా మంది ముద్దుగుమ్మలు ఉన్నారు. అవసరమనుకొంటే కొత్తవాళ్లని పరిచయం చేయొచ్చు. వయసు మీదపడిన హీరోలకు మాత్రం ఆ విషయంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. హీరోయిన్స్ అస్సలు దొరకడం లేదు. పరభాషలు వెళ్లొచ్చినా ఫలితం కనిపించడం లేదు. దీంతో సినిమాలు ఆలస్యమవుతున్నాయి. ఆ బాధని తీర్చేందుకే అసిన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఇక రకరకాల కారణాలతో ఈ చిత్రం ప్రారంభం డిలే అవుతూ వచ్చినా స్క్రిప్టు పరంగా పవన్ కి పూర్తి సంతృప్తి చెందాడని అందుకే జనవరి నుంచి కంటిన్యూ షెడ్యూల్ ప్రాంరంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. అత్తారింటికి దారేది తర్వాత పవన్ పూర్తిగా ఈ స్క్రిప్టుపైనే దృష్టి పెట్టారు. కంటిన్యూగా స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కూడా పెద్ద హిట్టవుతుందని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












