పవన్కు అజ్ఞాతవాసి చివరి చిత్రమా? సినిమాలకు గుడ్ బై.. ఆడియో ఆవిష్కరణలో కీలక ప్రకటన?
Recommended Video

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దృష్టంతా రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే. అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ అనూహ్యంగా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లాడు. తనదైన శైలిలో రాజకీయ ప్రక్షాళనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతవారం పవన్ చేసిన పర్యటనల్లో సినిమాలకు గుడ్ బై చెబుతానని చూచాయగా ప్రకటనలు కూడా చేశారు. నేడు (డిసెంబర్ 19) తన సినీ కెరీర్పై ఓ పవన్ ఓ కీలక ప్రకటన చేస్తారనే ఊహాగానాలు సినీవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. దాంతో అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ వేడుకపై అందరి దృష్టి పడింది.

అజ్ఞాతవాసి చిత్రం తర్వాత ఏమిటీ?
అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ సినిమా ఏమిటనే విషయంపై క్లారిటీ లేదు. అయితే జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన సైనికులతో చర్చలు వేగవంతం చేశారు. సినిమా షూటింగ్ గ్యాప్లో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు పవన్ సిద్దమవుతున్నట్టు సమాచారం.

హైటెక్స్లోనే కీలక ప్రకటన
ఇక జనసేన పార్టీ ఆవిర్భావ ప్రకటన హైటెక్స్ ప్రాంగణంలోనే జరిగింది. ఇప్పుడు అదే ప్రాంగణంలో అజ్ఞాతవాసి ఆడియో వేడుక కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించడం వ్యూహాత్మకమా లేదా యాదృచ్చికమా అనే మాట వినిపిస్తున్నది.

చిత్రాలతో సంతృప్తి లేదు
ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సినిమా విజయాలు, సినిమాలు నాకు సంతృప్తిని ఇవ్వవు అని తాజా ఏపీ పర్యటనలో వెల్లడించారు. నీతివంతమైన రాజకీయాలకు స్వాగతం పలుకుదామని యువతకు పిలుపునిచ్చారు.

సత్యగ్రహి కథ రాసుకొన్నా..
ఇటీవల ఏపీ పర్యటనల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమాన్ని కాలరాస్తున్న ప్రభుత్వాలపై పోరాటం చేసే అంశాలతో సత్యాగ్రహి అనే కథ రాసుకొన్నాను. కానీ సినిమాగా తీయకూడదు అని అనుకొన్నాను. నేను ఓ సత్యాగ్రహి కాకూడదు అని అనుకొన్నాను.

సినిమాలతో సాధ్యం కాదు..
సినిమాల వల్ల ఆచరణ సాధ్యం కాదు. వ్యవస్థలు మారవు. అందుకే నిజజీవితంలో నేను సత్యాగ్రహిగా మారడానికి సిద్ధపడ్డాను. 2003లో రాజకీయాల్లోకి రావాలని అమ్మా, నాన్న, అన్నయ్య చిరంజీవికి చెప్పాను. ప్రజారాజ్యంతో నా కలను సాకారం చేసుకోవాలని అనుకొన్నాను. కానీ అది నేరవేరలేదు. జనసేనతో నోటు రహిత రాజకీయాలకు మద్దతు తెలుపుదాం అని పవన్ పిలుపునిచ్చారు.

సినిమాల్లో నాకు ఆనందం లేదు
సినిమాలు విజయం సాధిస్తుంటే నాకు ఆనందం లేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరిక రోజు రోజుకు బలంగా మారింది. మీ అందరి సహకారం ఉంటే అది సాధ్యమవుతుంది. నాకు సినిమాలు అసలే ముఖ్యం కాదు అని పవన్ అన్నారు.

పవన్, ఎన్టీఆర్ కలయిక
ఇక మెగా హీరోల ఫంక్షన్లకు నందమూరి హీరోలు వచ్చిన సందర్భాలు అసలే కనిపించవు. కానీ ఈ మధ్య ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ముహుర్తం షాట్కు పవన్ హాజరు కావడం జరిగింది. ఎన్టీఆర్, పవన్ కలయిక విషయంపై పెద్దగానే చర్చ జరిగింది.

అజ్ఞాతవాసికి ఇద్దరి అండ
ఇలాంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు చిరంజీవి, జూ. ఎన్టీఆర్లు హాజరవుతున్నారనే వార్త మీడియాలో హంగామా సృష్టిస్తున్నది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ గానీ, ఆయా హీరోల ఫ్యాన్స్ గానీ పెదవి విప్పడం లేదు. అజ్ఞాతవాసి ఆడియోకు చిరంజీవి, ఎన్టీఆర్ హాజరవుతున్న వార్త నిజమే అని కొన్ని వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం ఉందనే మాట కూడా వినిపిస్తున్నది. ఎందుకంటే ఎన్టీఆర్ నటించే తదుపరి చిత్రం ఎస్ రాధాకృష్ణ నిర్మాణ సారథ్యంలోనే కావడంతో ఆ వార్త మరింత బలపడింది.

జనసేనలోకి చిరంజీవి
ఒకవేళ చిరంజీవి, తారక్ అజ్ఞాతవాసి ఆడియోకు హాజరైతే రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెర లేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న చిరంజీవి జనసేన పార్టీలో చేరుతారని, పార్టీలో కీలక బాధ్యతలను ఆయన స్వీకరిస్తారనే న్యూస్ ప్రచారంలో ఉంది.

అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ వేదికగా
ఇలాంటి వార్తల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ దీనికి వేదిక కానున్నదా? లేదా మరో సినిమా చేసి సినిమాలకు ముగింపు పలుకుతాడా అనే విషయం కాలమే సమాధానం చెబుతుంది.


Click it and Unblock the Notifications











