ఫ్యాన్స్ కు పవన్ పార్టీ సూచన
హైదరాబాద్ : పవన్ కల్యాణ్ తన కొత్త రాజకీయ పార్టీ పేరును 'జన సేన'గా అధికారికంగా ప్రకటించి, ఆ పనుల్లో తన అభిమానులకు స్ధానం కలిపిస్తున్నారు. తాజాగా ఆయన ఫ్యాన్స్ కు ఓ సూచన చేసారని సమాచారం. ఇంటర్నెట్ నుంచి పార్టీ దరఖాస్తులను డౌన్లోడ్ చేసి, వీలైనంత ఎక్కువ మంది యువతను జనసేన సభ్యులుగా చేర్చాలని పవన్ అభిమానులకు సూచన అందింది. అలాగే పార్టీ బహిరంగ సభ గురించి మాత్రం ఏ సమాచారం వారికి ఇప్పటివరకూ అందలేదని తెలుస్తోంది.
విశాఖపట్నంలో ఈ నెల 27వ తేదీన పవన్ కల్యాణ్ పార్టీ జనసేన మహాసభను నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భావ ప్రకటనతోనే రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన పవన్ కల్యాణ్ విశాఖ వేదిక ద్వారా తన పార్టీ అజెండాను, విధి విధానాలను ప్రకటిస్తారు. తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి రచించిన 'ఐడియాలజీ ఆఫ్ జనసేన' పుస్తకాన్ని కూడా ఇదే వేదికపై ఆవిష్కరించనున్నారు. అయితే ఈ మహాసభ ఏర్పాట్లకు సంబంధించి విశాఖ అభిమానులకు ఇంతవరకు ఎటువంటి సమాచారం అందలేదు.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించి చేసిన భావోద్వేగ ఉపన్యాసం అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రజలను కుదిపేసింది. ఇచ్ఛాపురం నుండి తడ వరకు, హిందూపురం నుంచి ఆదిలాబాద్ వరకు పవన్ కళ్యాణ్ ప్రసంగం, జనసేన పార్టీ ప్రతి ఇంట్లో చర్చనీయాంశమైంది. దీంతో తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్, సీమాంధ్రలో టిడిపి, వైఎస్ఆర్సిపికి పవన్ ఫీవర్ పట్టుకుంది. కాంగ్రెస్ హటావో, దేశ్కీ బచావో నినాదంతో పాటు టిఆర్ఎస్ను మాటలతో చీల్చిచెండాడం, సీమాంధ్రలో కాంగ్రెసేతర పక్షాలతో పొత్తులకు రెడీ అని ప్రకటించడం చూస్తే వచ్చే నెల రోజుల్లో కొత్త పొత్తులకు తెరలేచినట్లయింది.
తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రకటించడంతో ఇక అన్ని పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన హైదరాబాద్ రంగారెడ్డితో పాటు మరో నాలుగు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని ఉధృతం చేయాలనుకుంటున్నారు. కెసిఆర్ కుటుంబాధిపత్యాన్ని, కాంగ్రెస్ను వ్యతిరేకించి అన్ని రాజకీయ పార్టీలతో పొత్తుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంతో రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కుదేలయ్యాయి. పవన్పై దాడి చేసేందుకు తగిన అస్త్రాలు లేక సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు విలవిలలాడాయి.


Click it and Unblock the Notifications











