Chiranjeevi ఎదురుచూపులు.. ఎటూ తేల్చని ఏపీ ప్రభుత్వం.. అసలేం జరుగుతుంది?
తెలుగు సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నది. టాలీవుడ్ నటులకు, ఏపీ రాజకీయ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం వివాదాస్పదంగా మారాయి. అయితే సినీ పరిశ్రమకు సంబంధించిన రాయితీలు, టిక్కెట్ల పెంపు వ్యవహారం, అలాగే ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి, థియేటర్ల లైసెన్సుల అనుమతి లాంటి అంశాలు మీడియాలోను, సినీ, రాజకీయ వర్గాల్లోను చర్చకు దారి తీశాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి కార్యచరణ ప్రకటించబోతుందనే విషయంలోకి వెళితే..

ఏపీలో కొనసాగుతున్న టికెట్ రేట్ల వివాదం
గతంలో ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకొనే వెసలుబాటు, అలాగే ప్రత్యేక ప్రదర్శనలు వేసుకొనే అవకాశం పెద్ద నిర్మాతలు, భారీ బడ్జెట్ చిత్రాలకు ఉండేది. ఏపీలో కరోనావైరస్ పరిస్థితుల నెలకొనడం, ఆ తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పరిస్థితులు సినీ నిర్మాతలకు ప్రతికూలంగా మారాయి.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో దుమారం
అయితే టాలీవుడ్ సినిమాల రిలీజ్లపై ఆంక్షలు విధించడం, టికెట్ రేట్లను తగ్గిచడం, అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకొని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది.

నాని వ్యాఖ్యలతో మరింత గందరగోళం
ఇక తాజాగా నేచురల్ స్టార్ నాని తాను నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్లో ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. థియేటర్ కౌంటర్ల కంటే కిరాణ దుకాణం కౌంటర్లలో రాబడి ఎక్కువ ఉంది. సినిమా టికెట్ రేట్లు తగ్గించడం ప్రేక్షకులను అవమానించడమే అనే నాని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో దుమారం లేపాయి.

ఏపీ ప్రభుత్వంతో చర్చలకు చిరంజీవి
సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలపై విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో పలు విషయాలను చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీ వేయమని సినీ పరిశ్రమ పెద్దలకు సూచించింది. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ను కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవి అపాయింట్మెంట్ కోరడం చర్చనీయాంశమైంది.

అపాయింట్మెంట్ కోసం చిరంజీవి నిరీక్షణ
అయితే ఏపీ ప్రభుత్వంతో పలు అంశాల గురించి చర్చించేందుకు చిరంజీవి కోరిన అపాయింట్మెంట్పై ఎలాంటి స్పందన లేకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే కమిటీ ఏర్పాటు నేపథ్యంలో చిరంజీవికి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే చిరంజీవి వాస్తవంగానే ఏపీ ప్రభుత్వం పిలుపు కోసం వేచి చూస్తున్నారా అనేది వ్యవహారంపై స్పష్టమైన క్లారిటీ కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











