పవన్ పెట్టిన కండీషన్స్ కి ఖంగు తిన్నారు
హైదరాబాద్: ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ బీజేపీ తరఫున ప్రచారానికి మాత్రం కొన్ని కండీషన్స్ పెట్టి అందరినీ ఖంగుతినిపించారు. తాను పెట్టిన కండీషన్స్ కు సమ్మతిస్తేనే ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానని బిజెపి నేతలకు ఆయన తేల్చి చెప్పారు. దాంతో ఊహించని ఈ ట్విస్ట్ కు వారంతా ఆలోచనలో పడ్డారు. అయితే తమ పార్టీకి ఇప్పుడున్న పరిస్ధితుల్లో పవన్ వంటి వారు వస్తేనే కర్ణాటకలో కలిసివస్తుందని భావించి అన్నింటికి ఓకే చేసారు. దాంతో పవన్ ఈ రోజు(మంగళవారం) కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లుతున్నారు.
ఇంతకీ పవన్ ఏం కండీషన్స్ పెట్టాడు అంటే... "కర్ణాటకలో మీ పార్టీలో ఉన్నవారిపై కొన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి బళ్ళారి జిల్లాలో ఉన్న నేతలపై చాలా ఉన్నాయి. అక్కడ తెలుగువారు అధికంగా ఉన్నారని నన్ను అక్కడకు వెళ్లి వారి తరఫున ప్రచారం చేయాలని చెప్పొద్దు. ఇవి మీకు సమ్మతమైతే వస్తాను. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేను మోడీకి మద్దతు ఇచ్చాను తప్ప నేను బీజేపీ మనిషిని కాదు. నేను మీ తరపున ప్రచారం చేయాలంటే నావి కొన్ని షరతులు ఉన్నాయి. మీరు అధికారంలోకి వస్తే మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా పని చేయాలి'' అని వారితో చెప్పారు. దాంతో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆయన చేత ప్రచారం చేయించి ఓట్లు కుమ్ముకుందామన్న బిజెపీ ప్లాను కి గండిపడింది.

పవన్కల్యాణ్ కన్నడనాట నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. భాజపాకు మద్దతుగా ఆయన మూడు చోట్ల ప్రచారం చేయనున్నట్లు ఆపార్టీ నేతలు పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఉదయం బెంగళూరు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కోలారు వెళతారు. ఉదయం తొమ్మిది గంటలకు విశ్వేశ్వరయ్య క్రీడామైదానంలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 11.15 గంటలకు కోలారు నుంచి బయలుదేరి రాయచూరు చేరుకుంటారు. పట్టణంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనున్న బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తర్వాత గుల్బర్గ జిల్లా గురుమిఠ్కల్కు వెళ్లి అక్కడా ప్రసంగిస్తారని భాజపా వర్గాలు సోమవారం రాత్రి పర్యటన వివరాలను వెల్లడించాయి.
మరో ప్రక్క జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో లోక్సత్తా తరఫున ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సత్తా పార్టీ అగ్రనేతల వినతిపై ఆయన ఇంకా స్పందించకపోయినా, సానుకూలంగా ఉన్నట్లు లోక్సత్తా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ జనసేన పార్టీని స్థాపించక ముందు, ఆయనను లోక్సత్తాలో చేరాల్సిందిగా లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.జయప్రకాశ్నారాయణ్(జేపీ) ఆహ్వానించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











