అలీ 369...టీవీషో దర్శనమివ్వనున్న పవన్ కళ్యాణ్?
హైదరాబాద్: బుల్లితెర ప్రేక్షకులకు శుభ వార్త. ఇప్పటి వరకు కేవలం సినిమాల్లోనే చూసిన పవన్ కళ్యాణ్ను తొలిసారి బుల్లితెర కార్యక్రమాల్లో చూడబోతున్నాం. ఈటీవీలో ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహిస్తున్న ప్రముఖ 'అలీ 369' షోలో పవన్ కళ్యాణ్ దర్శనం ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీపావళి పండగను పురస్కరించుకుని నవంబర్ 3న ప్రసారం అయ్యే షోలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. 'అత్తారింటికి దారేది' చిత్రం ప్రమోషన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ షోలో దర్శనం ఇవ్వబోతున్నట్లు సమాచారం. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా పవన్ ధన్యవాదాలు తెలుపనున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుల్లో కమెడియన్ అలీ ఒకరు. పవన్ ప్రతి సినిమాలోనూ అలీకి తప్పకుండా ఓ క్యారెక్టర్ ఉంటుంది. అలీ నిర్వహిస్తున్న టీవీ షో కావడంతో పవన్ కళ్యాణ్ రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ తొలిసారిగా బుల్లితెరపై కనిపిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
వాస్తవానికి పవన్ కళ్యాణ్కు సినిమా ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనే అలవాటు మొదటి నుండీ లేదు. అయితే 'అత్తారింటికి దారేది' సినిమా తర్వాత పవన్ తన అలవాట్లను మార్చుకున్నారు. సినిమా పైరసీకి గురి కావడం, అదే సమయంలో భారీ విజయం సాధించడం పవన్లో మార్పు తెచ్చినట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











