మంచాన ఉన్న అభిమానికి బాలయ్య ఫోన్.. నా నడుం కూడా విరిగింది మరి అంటూ.. సోషల్ మీడియాలో వైరల్!
తండ్రి వారసత్వంతో సినిమాల్లో ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలతో పోటీ పడుతూ బాలకృష్ణ కూడా తనదైన స్థానం సంపాదించారు. దాదాపు 105 పైగా సినిమాల్లో నటించిన బాలకృష్ణ తన అభిమానులతో నడుచుకునే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తన అభిమానులు తప్పు చేస్తే అక్కడికక్కడే దండించే బాలయ్య అదే అభిమానులు మంచి చేస్తే వాళ్లకు అండగా నిలబడడమే కాక ప్రోత్సహిస్తూ ఉంటారు. తాజాగా బాలకృష్ణ ఒక అభిమానితో మాట్లాడిన ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చిత్తూరు జిల్లాకి చెందిన అభిమాని మురుగేష్ కు హీరో బాలక్రిష్ణ ఫోన్ లో పరామర్శించారు. చెట్టుపై నుంచి పడి అనారోగ్యంతో మంచానికి పరిమితం అయిన బాలకృష్ణ అభిమాని మురుగేష్ విషయాన్ని తోటి అభిమానులు బాలయ్య దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ క్రమంలో ఈ ఉదయం మురుగేష్ తో ఫోన్ లో మాట్లాడిన బాలక్రిష్ణ, ఆదిత్య 369 షూటింగ్ సమయంలో తనకు కూడా నడుం విరిగిందని, అయినా కోలుకున్నానని ధైర్యంగా ఉండాలని అభయం ఇచ్చారు. శాంతిపురం మండలం గొల్లపల్లికి చెందిన బాధితుడికి 40 వేలు ఆర్థిక సాయం కూడా చేశారు బాలకృష్ణ అభిమానులు. ఇక తాను కూడా అండగా ఉంటానని బాలకృష్ణ అభయం ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికి సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకుపడడంతో ఈ సినిమా వాయిదా పడింది. ఇక ఆయన తదుపరి సినిమా గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఉండనుంది. ఆ తరువాత ఆయన అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











