మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్: రామ్ చరణ్ కీలక నిర్ణయం.. వచ్చే నెలలో అధికారిక ప్రకటన.!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో ఒకరు. 'చిరుత' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ యంగ్ హీరో.. రెండో సినిమా 'మగధీర'తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు. దాని తర్వాత మరికొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని చరణ్.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఏంటా న్యూస్..? వివరాల్లోకి వెళితే..

సరికొత్త ప్రయోగంతో వస్తున్నాడు
రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ‘RRR' అనే సినిమాలో నటిస్తున్న సంగతి విధితమే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో చరణ్.. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ద్విపాత్రాభినయం చేస్తున్న చరణ్
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. గతంలో తన తండ్రితో ‘ఖైదీ నెంబర్ 150' అనే సినిమాను నిర్మించిన చెర్రీ.. ఇటీవల ‘సైరా: నరసింహారెడ్డి' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అలాగే, త్వరలోనే ప్రారంభం కానున్న కొరటాల - చిరు మూవీకి కూడా అతడే నిర్మాతగా వ్యవహరించనున్నాడు.

అప్పటి వరకు చరణ్కు ఖాళీ లేదు
రామ్ చరణ్ ‘RRR' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు విశాఖపట్నం జిల్లాలోని మన్యంలో జరుగుతున్న షెడ్యూల్లో ఉన్నాడు. ఈ షెడ్యూల్తో పాటు క్లైమాక్స్ షూటింగ్ వరకు అతడు ఖాళీగా ఉండడు. ఆ తర్వాత ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. అంటే ‘RRR' విడుదల అయ్యే వరకు చరణ్ బిజీ అన్న మాట.

చరణ్ కీలక నిర్ణయం.. జనవరిలో ప్రకటన
రామ్ చరణ్ తేజ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. దీని ప్రకారం.. అతడు వచ్చే ఏడాది ‘RRR' కాకుండా మరో సినిమాను విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే జనవరిలో వెలువడనుందని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

ఇంతకీ ఎవరితో ఉంటుంది.?
రామ్ చరణ్ తన తర్వాతి సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అతడు ఎవరితో కలిసి పని చేయబోతున్నాడన్న చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి చరణ్.. ‘అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ, అతడు బాలీవుడ్ మూవీతో బిజీగా ఉన్నాడు. దీంతో చెర్రీ తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











