మీకు ఆడవాళ్లంటే పిచ్చా? ఊహించని ప్రశ్నకు సిద్ధూ జొన్నలగడ్డ సమాధానం ఏమిటంటే?
ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు మీడియాతో మాట్లాడాలంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎవరు ఎలాంటి ప్రశ్న అడుగుతారో? ఏ వివాదం రేగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల తన మనో భావాలు దెబ్బతినేలా ప్రశ్నలు అడిగారంటూ మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న ఓ జర్నలిస్ట్పై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే మహిళా కమీషన్ వరకు వెళ్లాలని నిర్ణయించుకోవడం టాలీవుడ్లో కలకలం రేపింది. సదరు జర్నలిస్ట్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇది జరిగి రోజులు గడవకముందే ఏకంగా ఓ హీరో వ్యక్తిత్వాన్ని కించపరిచేలా జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు రావడం కలకలం రేపింది. ఈ వివరాల్లోకి వెళితే...
ప్రెస్మీట్లలో వివాదాలు
సినిమా రిలీజ్ల సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు నిర్వహించే ప్రెస్మీట్లు ఇటీవల వివాదాస్పదం అవుతున్నాయి. గతేడాది హీరోయిన్ అనన్య నాగళ్ల నటించిన పొట్టేల్ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్ట్ చేతిలో అనన్యకు చేదు అనుభవం ఎదురైంది. మీరు కెరీర్లో కమిట్మెంట్ బాధితురాలా? అని సదరు విలేకరి అడగటంతో అనన్య ఇబ్బందిపడటంతో పాటు సీరియస్ అయ్యారు. వేదికపై ఉన్న నటిని ఇంత సున్నితమైన అంశంపై ఎలా ప్రశ్నిస్తారని మండిపడ్డారు.

విలేకరిపై మంచు లక్ష్మీ సీరియస్
ఇక ఇటీవల... దక్ష- ది డెడ్లీ కాన్స్పిరసీ అనే మూవీలో మంచు లక్ష్మీ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ సీనియర్ జర్నలిస్ట్కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రసన్న డ్రెస్సింగ్ విధానంపై సదరు విలేకరి అడిగిన ప్రశ్న కలకలం రేపింది. దానిపై మండిపడ్డ మంచు లక్ష్మీ అక్కడికక్కడే... మహేశ్ బాబుని కానీ, ఏ స్టార్ హీరోనైనా అడగ్గలరా? అని ప్రశ్నించింది. అలాగే విషయాన్ని సీరియస్గా తీసుకుని ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసింది. దాంతో సదరు జర్నలిస్ట్.. మంచు లక్ష్మీకి క్షమాపణలు చెప్పారు.
అక్టోబర్ 17న తెలుసు కదా
కాగా.. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ తదితర సినిమాలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ.. ఆయన నటించిన తాజా చిత్రం తెలుసు కదా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా నీరజ కోన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. వైవా హర్ష, రవి మరియా తదితరులు కీలకపాత్రలు పోషించారు. వీఎస్ జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. తమన్ స్వరాలు అందించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న తెలుసు కదా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీరు ఉమనైజరా?
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ వరుసపెట్టి ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లు విడుదల చేయడంతో పాటు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. దీనిలో భాగంగా హీరో సిద్దూ జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి, హర్ష, నీరజ కోనలు మీడియా మీట్ నిర్వహించి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో రియల్ లైఫ్లో ఉమనైజరా? రియల్ లైఫ్లో ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించారా? అంటూ ఓ మహిళా విలేకరి ఊహించని ప్రశ్న వేసింది. దాంతో షాకైన సిద్ధు.. ఆ వెంటనే తేరుకుని ఇది సినిమా గురించి ఇంటర్వ్యూనా? లేక నా పర్సనల్ లైఫ్ గురించి ఇంటర్వ్యూనా అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











