కుక్కల కోసం 45 కోట్ల బంగ్లా.. డొనేట్ చేసిన స్టార్ హీరో
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కుక్కల గురించి పంచాయతీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సహా దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వీధి కుక్కలన్నింటినీ తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో జంతు ప్రేమికులు తెగ బాధపడిపోతున్నారు. వీధి కుక్కలన్నింటినీ ఉన్నపళంగా ఎలా తరలిస్తారంటూ సుప్రీం తీర్పునే విమర్శిస్తున్నారు. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. అయితే కుక్కల కోసం ఏకంగా కోట్లు విలువ చేసే తన ఇంటినే నివాసంగా కేటాయించి పెద్ద మనసు చాటుకున్నారు ఓ హీరో. ఆయనెవరు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో వీధి కుక్కలు ఉండొద్దు
దేశ రాజధాని ప్రాంతంలో రాబిస్ మరణాల సంఖ్య పెరుగుతున్నట్లుగా వస్తున్న వార్తలను పరిగణనలోనికి తీసుకున్న సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం 8 వారాల్లోపు వీధి కుక్కలు షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు ఉండటానికి వీల్లేదని తేల్చిచెప్పింది. తమ ఆదేశాలకు అడ్డుకోవడానికి ఏవరు అడ్డొచ్చినా కఠిన చర్యలు తప్పవని సుప్రీంకోర్ట్ హెచ్చరించింది. అలాగే తమ తీర్పుకు వ్యతిరేకంగా పర్యావరణ, జంతు ప్రేమికులు, వ్యక్తులు, సంస్థలు వేసే పిటిషన్లను విచారించేది లేదని తేల్చి చెప్పింది. వీధి కుక్కల కోసం 5000 షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోర్ట్ ఆదేశించింది.

సుప్రీం తీర్పుపై విమర్శలు
అయితే సుప్రీంకోర్ట్ తీర్పుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఆదేశాలను అమలు చేయడం చాలా వ్యయ ప్రయాసలతో కూడినదని అన్నారు. ఢిల్లీలో దాదాపు 3 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని.. వాటి కోసం షెల్టర్లు నిర్మించాలని ఇందుకు వేల కోట్లు అవసరమవుతాయని దీనిని భరించే స్థితిలో ఢిల్లీ ప్రభుత్వానికి ఉందా? అని కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ప్రశ్నించారు. వాటి ప్రాణాలు తీయకుండా స్టైరిలైజేషన్, వ్యాక్సినేషన్, కమ్యూనిటీ కేర్ వంటి చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శల నేపథ్యంలో ఆగస్ట్ 11న జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను తాను పున: సమీక్షిస్తానని బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.
కుక్కలనే పెళ్లి చేసుకోమ్మంటూ వర్మ ట్వీట్
దేశంలో ఎక్కడ ఏ వివాదం రాజుకున్నా వెంటనే స్పందించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఈ వీధి కుక్కల వివాదంపైనా విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుపై జంతు, పర్యావరణవేత్తలు చేస్తున్న విమర్శలకు తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. కుక్కలనే పెళ్లి చేసుకోవాలని, పేదలను ధనవంతులు తమ ఇళ్లలోకి తెచ్చుకుని వీధులను కుక్కలకే వదిలేయాలన్నారు. మీ పిల్లలను వీధి కుక్కలు గుంపుగా ఉన్నప్పుడు ఆడుకోవడానికి పంపగలరా? అని వర్మ సెటైర్లు వేశారు. వీధి కుక్కల కోసం పాఠశాలల కట్టాలని.. దేవాలయాల్లో దేవుళ్ల విగ్రహాలను తీసేసి వీధి కుక్కలను పెట్టాలంటూ ఓ రేంజ్లో ఫైరయ్యారు వర్మ.
కుక్కల కోసం 45 కోట్ల భవనం
ఆర్జీవీ తీరు ఇలా ఉంటే.. కుక్కల కోసం ఏకంగా కోట్లాది విలువైన తన భవనాన్ని రాసిచ్చేశారు బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి. 70, 80 దశకాలలో హిందీ చిత్ర పరిశ్రమను ఊపేసిన ఆయన తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన వయసు, ఇమేజ్కు తగ్గ సినిమాలలో నటిస్తూ ఇటీవలే భారతీయ సినీ రంగంలో అత్యున్నత అవార్డ్గా పేరొందిన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని పొందారు. తొలి నుంచి కుక్కలను పెంచుకోవడాన్ని ఇష్టపడే మిథున్ చక్రవర్తి ఏకంగా 116 కుక్కలను దత్తత తీసుకున్నారు. అంతేకాదు.. వాటి కోసం ముంబైలోని ఓ ద్వీపంలో ఉన్న తన 1.5 ఎకరాల విశాల భవనాన్ని కేటాయించారు. అక్కడ కుక్కల కోసం అన్ని రకాల వసతులు కల్పించారు మిథున్.. వాటి ఆలనా పాలనా చూసుకోవడానికి సంరక్షకులను నియమించి, ఆట స్థలాలు కూడా కట్టించారు. అన్నట్లు ఈ భవనం విలువ అక్షరాల 45 కోట్ల రూపాయలట. ఇంత విలువైన ఆస్తిని మూగజీవాల కోసం కేటాయించి తన పెద్ద మనసు చాటుకున్నారు మిథున్ చక్రవర్తి.


Click it and Unblock the Notifications











