అనుష్క 'అరుంధతి' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
అనుష్క శెట్టి సినీప్రస్థానంలో మైలురాయి'అరుంధతి'.ఈ సినిమా ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. దర్శకుడు కోడిరామకృష్ణ అద్భుతమైన కథా నిర్మాణంతో తెరపై మంత్రం వేసి చూపించాడు. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ప్లే, పవర్ఫుల్ ఎమోషన్స్ వన్నీ కలిపి "అరుంధతి"ని టాలీవుడ్లో ఓ లెజెండరీ చిత్రంగా నిలబెట్టాయి. ఈ సినిమాలో అనుష్క నటన నిజంగా అద్బుతం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆమె అరుంధతి పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఆమె నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే.. ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క కంటే ముందు మరో ముద్దుగుమ్మను అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ? అరుంధతి ఛాన్స్ మిస్ అయ్యినందుకు ఇప్పుడు ఆమె తెగ ఫీల్ అవుతున్నారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..
2009లో విడుదలైన తెలుగు సినిమా 'అరుంధతి' తెలుగు సినీ చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలిచింది. దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా అనుష్క శెట్టికి కెరీర్ టర్నింగ్ పాయింట్గా మారింది. 'అరుంధతి' సినిమా బడ్జెట్ అప్పటి ప్రమాణాల ప్రకారం భారీదే. సుమారు 13 కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కించారు. విడుదల తర్వాత దాదాపు 70 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇది ఒక స్టార్ హీరో లేకుండా, పూర్తిగా లేడీ లీడ్ రోల్ తో తెరకెక్కిన చిత్రం కావడంతో, టాలీవుడ్లో కొత్త రికార్డు సృష్టించింది. జేజమ్మ పాత్రలో అనుష్క అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఆమెను "లేడీ సూపర్ స్టార్"గా నిలిచింది.

'అరుంధతి' కథను తెరకెక్కించే దశలో దర్శకుడు కోడి రామకృష్ణ తన మనసులో ముగ్గురు హీరోయిన్ల పేర్లు ఉంచుకున్నారని టాక్. అందులో మొదటగా మలయాళ హీరోయిన్ మమతా మోహన్ దాస్, తరువాత కన్నడ నటి ప్రేమ, అలాగే బాలనటి నుంచి హీరోయిన్గా మారిన రాశీ పేర్లు ఉన్నాయి. మమతా మోహన్ దాస్ను కోడి రామకృష్ణ వ్యక్తిగతంగా సంప్రదించినప్పటికీ, ఆమెకు ఈ సినిమా చేయడంపై కొందరు అపశకునాలు చెప్పారు. "ఈ సినిమా చేస్తే కెరీర్ అంతమవుతుంది" అనే నమ్మకం వల్ల ఆమె ఆ ఆఫర్ను వదులుకుంది. అదే సమయంలో కన్నడ నటి ప్రేమ డేట్స్ కుదరక సినిమాకు నిరాకరించింది.
ఈ ఇద్దరు హీరోయిన్లు అప్రూవ్ కాకపోయిన తర్వాత కోడి రామకృష్ణ దృష్టి రాశీ వైపు మళ్లింది. రాశీ అప్పటికి తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయం. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి, ఆ తరువాత హీరోయిన్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు రామకృష్ణ గారికి ఆమెతో కుటుంబ అనుబంధం కూడా ఉంది. అయితే, అప్పటికే రాశీ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్లిపోయింది. దాంతో దర్శకుడు వేరే ఆప్షన్ వెతకాల్సి వచ్చింది. చివరికి అనుష్కను ఫైనల్ చేశారట. ఆ నిర్ణయమే బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది. అనుష్క కెరీర్ లో మైలురాయిగా మారింది.
అరుంధతి చేసి ఉంటే నా లైఫ్ మారిపోయేది!
ఇటీవల హీరోయిన్ రాశీ యాంకర్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అరుంధతి ఆఫర్ చేజార్చుకున్న విషయాన్ని వెల్లడించారు. "అరుంధతి సినిమాలో అనుష్క చేసిన జేజమ్మ పాత్ర అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆ పాత్ర నేను చేస్తే బాగుండేది అనిపించింది," అని చెప్పింది.
అలాగే ఆమె చెప్పిన ఆసక్తికర విషయం "ఓసారి నేను కోడి రామకృష్ణ గారిని అడిగాను, నన్ను ఎందుకు తీసుకోలేదు అరుంధతికి? అని. దానికి ఆయన నవ్వుతూ, నిన్ను ఎవరు త్వరగా పెళ్లి చేసుకోమన్నారు? నీ పెళ్లే కారణం! అని అన్నారు," అంటూ రాశీ నవ్వుతూ గుర్తుచేసుకుంది. ఈ మాటలోనే సమాధానం ఉందని ఆమె చెప్పింది. నిజానికి రాశీ అప్పటికి ఇండస్ట్రీలో మంచి స్థానం కలిగిన హీరోయిన్. ఒకవేళ ఆమె ఆ సినిమా చేసుంటే, ఆమె కెరీర్ దిశ పూర్తిగా మారిపోయేదని విశ్లేషకులు అంటున్నారు.
రాశీ బాలనటిగా కెరీర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి నిర్మాతగా పనిచేసిన అనుభవం ఉంది. చిన్నప్పటి నుంచే కోడి రామకృష్ణ సినిమాల్లో బాలనటిగా కనిపించిన రాశీకి ఆయనతో సన్నిహిత బంధం ఏర్పడింది. అందుకే ఆమె ఆయనను "అంకుల్" అని పిలుస్తుందట. కోడిరామకృష్ణ రాశీని ఎప్పుడూ ప్రతిభావంతురాలిగా గుర్తించి, ఆమె నటనకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చేవారని రాశీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.
రాశీ పెళ్లి చేసుకున్న తరువాత పూర్తిగా కుటుంబ జీవితంలో బిజీ అయిపోయింది. అయితే నటనపై ఉన్న ప్యాషన్ మళ్లీ ఆమెను తెరపైకి తెచ్చింది. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత రాశీ 'నిజం' సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చినా, ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఆ తరువాత టీవీ సీరియల్స్ వైపు మళ్లిన రాశీ, 'జానకి కలగనలేదు' సీరియల్లో హీరో తల్లి పాత్రలో కనిపించింది. ఆ సీరియల్ మధ్యలోనే ఆగిపోయినా, ఆమె నటన మాత్రం ప్రేక్షకుల మనసు దోచుకుంది. ప్రస్తుతం ఆమె అప్పుడప్పుడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తూ, టీవీ షోలు, రియాలిటీ ప్రోగ్రాంలలో పాల్గొంటోంది.


Click it and Unblock the Notifications











