మేనేజర్ నమ్మకద్రోహానికి ఉదయ్కిరణ్ బలి?
హైదరాబాద్: ఉదయ్కిరణ్ ఇటీవలి పరిస్థితి, అప్పులకు సంబంధించిన వాస్తవాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. ఉదయ్కిరణ్ మాజీ మేనేజర్ మున్నా అనే వ్యక్తి రూ.17 లక్షలు రుణం తీసుకున్నాడని, ఈ వ్యవహారంలో ఉదయ్కిరణ్ మధ్యవర్తిగా ఉన్నారని పోలీసు అధికారులకు ఆధారాలు లభించాయి. ఉదయ్కిరణ్ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మహిళా ఫైనాన్షియర్ వద్ద నూటికి రూ.10 వడ్డీ చొప్పున మున్నాకు అప్పు ఇప్పించారు.
అప్పు తీసుకున్నాక మున్నా సినిమా తీయకపోగా, ఉదయ్కిరణ్కు దూరమయ్యాడు. మున్నా అసలు, వడ్డీ రెండూ ఇవ్వకపోవడంతో సదరు మహిళ డబ్బు ఇవ్వాలంటూ ఉదయ్కు ఫోన్ చేసేవారు. మున్నా ఇవ్వకపోవడం, సొంతంగా డబ్బు లేకపోవడంతో తన భర్త మానసిక వ్యథ అనుభవించారని ఉదయ్కిరణ్ భార్య విషిత పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. మున్నా వివరాల కోసం ఆరాతీయగా.. హైదరాబాద్లోనే ఉన్నట్లు తెలిసింది.

ఉదయ్కిరణ్ హీరోగా సినిమాలు తీసేందుకు నలుగురైదుగురు నిర్మాతలు కొద్ది నెలల క్రితం అడ్వాన్సులు ఇచ్చారు. ఒక తమిళ సినీ నిర్మాత కూడా అడ్వాన్సు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. నాలుగు నెలలు క్రితం ఒక్కొక్కరూ వచ్చి తాము సినిమాలు తీయడం లేదంటూ ఉదయ్కిరణ్ వద్ద అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బును వెనక్కి తీసుకున్నారు. ఉదయ్కు అవకాశాలు తగ్గడంతో సహాయ నటుడిగా వేషం ఇచ్చేందుకు కొంతమంది నిర్మాతలు సంప్రదించగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది.
తమిళ నిర్మాత ఒకరు సినిమా తీస్తానని చెప్పి చెన్నైకి పిలిపించి, తీరా ఆ ప్రాజెక్ట్ చేయడం లేదని చెప్పినట్లు తెలిసింది. ఉదయ్కిరణ్ తనకు తెలిసిన వారికి ఫోన్లు చేస్తున్నా కొందరు సమాధానాలు ఇవ్వలేదని పోలీసులకు కుటుంబ సభ్యులు వివరించారు. మున్నా నమ్మకద్రోహం.. గతంలో పరిచయం ఉన్నవారు ముఖం చాటేయడం, కుటుంబం గడవడం కోసం భార్యను ఉద్యోగం చేయించడం వంటి అంశాలు ఉదయ్ను తీవ్రంగా బాధించి ఉంటాయనీ, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు వివరించారు. రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయనున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











