ఇపుడు కోసుకోమంటారా ఏంటి? తూచ్... తిరుపతిలో మీడియాకు చిక్కిన బండ్ల గణేష్!
తెలంగాణలో ఎన్నికలు జరుగడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటడు, నిర్మాత బండ్ల గణేష్ మీడియా ఇంటర్వ్యూల్లో తనదైన శైలి వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. అపుడు వరుసపెట్టి టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక పోతే... డిసెంబర్ 11న బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను.... అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఫలితాలు వెలువడి కాంగ్రెస్ ఓటమి పాలైన తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయిన గణేష్.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో మీడియాకు చిక్కారు.

మాది నవ్వే పరిస్థితా?
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన బండ్ల గణేష్ను మీడియా వారు చుట్టుముట్టటారు. ఆయన్ను ఫోటోలు, వీడియో తీస్తున్న కెమెరామెన్లు కొంచెం నవ్వండి సార్ అని అడగ్గా..... ఏం నవ్వుతాం? నవ్వే పరిస్థితా మాది?.... అంటూ అసంతృప్తిలో కూరుకుపోయారు.

నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరినీ ఆ స్వామి వారు చల్లగా చూడాలి. ఓటమి అనేది విజయానికి పునాది. నన్ను ఎవరో అజ్ఞాతంలో ఉన్నాను అంటున్నారు. నేను అజ్ఞాతంలో లేను, ఎక్కడికీ పారిపోలేదు అన్నారు.

మానసికంగా బాధలో ఉన్నాను
మేము అనుకున్న విధంగా జరుగకుండా మా పార్టీ ఓడిపోయింది కాబట్టి మానసికంగా రెండు మూడు రోజులు బాధతో సైలెంటుగా ఉండిపోయాను. పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాను. కానీ ప్రజలు మా ఊహలపై నీళ్లు చల్లారు. మా పార్టీని తిరస్కరించారు. వారు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు, అందుకే మౌనంగా ఉండటం మా బాధ్యతగా భావించాను.. అన్నారు.

వంద అంటాం, నన్ను ఇపుడు కోసుకోమంటారా.. ఏంటి?
మీ పార్టీ ఓడిపోతే బ్లేడుతో గొంతుసుకోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు కదా... అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘‘వంద అంటాం సార్, చాలా మంది చాలా అంటారు. అవన్నీ జరుగుతాయా? లేదు మీరు కోసుకొమ్మంటే కోసుకుంటా...అంటూ ప్రశ్నలతో విరుచుకుపడిన మీడియా వారిపై అసహనం వ్యక్తం చేశారు బండ్ల గణేష్.

మా వాళ్లలో ఉత్సాహం నింపేందుకే..
ఎన్నికల ముందు మా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికే అలా అన్నాను. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఇపుడు నన్నేం చేయమంటారు?..... అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











