అవన్నీ పూర్తిగా అబద్దం, నమ్మద్దు : అఖిల్
హైదరాబాద్ : ఒక సినిమా విడుదల వాయిదా పడిందంటే వెంటనే రీషూట్ రూమర్స్ బయిలు దేరతాయి. అలాంటిదే అఖిల్ లాంచింగ్ చిత్రం ‘అఖిల్' కు జరిగింది. దసరాకు ఈ సినిమా వచ్చి తీరుతుందన్న ఆనందంలో అభిమానులు ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడడంతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోయింది.

విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జరిగిన జాప్యం కారణంగా ఈ సినిమా దసరాకి రాలేకపోయింది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ నాగార్జున, దర్శకుడు వీవీ వినాయక్, హీరో అఖిల్, నిర్మాత నితిన్ ఇలా అందరూ సినిమా దసరాకు ఎందుకు రిలీజ్ కావట్లేదనే విషయమై స్పష్టతనిచ్చినా కూడా ‘అఖిల్'పై సినిమాపై పలు పుకార్లు పుట్టుకొచ్చాయి.
అఖిల్ సినిమాలో చాలా భాగాన్ని రీ షూట్ చేస్తున్నారని, సినిమా ఇప్పట్లో విడుదలయ్యే సూచనల్లేవని.. ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చిన నేపథ్యంలో అఖిల్ వీటన్నింటిని కొట్టిపడేస్తూ తన తాజా ట్వీట్ తో సమాధానమిచ్చారు.
అఖిల్ సినిమా విషయమై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయని, రీ షూట్ జరుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నానంటూ అఖిల్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు.
ఇప్పటికే ట్రైలర్ చూశాం,మేకింగ్ వీడియోలు చూసాం..... పాటలు, ఫైట్స్, డాన్స్ లు, డైలాగులు - వీటన్నింటిలోనూ అదే కనిపిస్తోంది. మరి అఖిల్ని తెరపై ఎలా చూపించారో తెలియాలంటే నవంబర్ 11, దీపావళి రోజు వరకూ ఆగాలి. ఎందుకంటే 'అఖిల్' సినిమా విడుదలయ్యేది అప్పుడే .

అఖిల్ అక్కినేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అఖిల్' . 'ది పవర్ ఆఫ్ జువా...' అనేది ట్యాగ్ లైన్. సాయేషా సైగల్ హీరోయిన్. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్, సుధాకర్రెడ్డి నిర్మాతలు. అనూప్ రూబెన్స్, థమన్ సంయుక్తంగా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.
అగ్నిగోళాన్ని సైతం తన చేతుల్లో ఇముడ్చుకోగల ధీశాలి ఆ కుర్రాడు. భగ భగ మండే సూర్యుడిని తలపించే అతని పయనం ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగిందో తెలియాలంటే 'అఖిల్' చిత్రాన్ని చూడాల్సిందే. నిర్మాతలు మాట్లాడుతూ...''మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. అఖిల్ చేసే యాక్షన్ హంగామా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అని చెబుతున్నారు.
రీసెంట్ గా ...తన సినిమా పనుల గురించి ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు వివరించాడు. అఖిల్ సినిమా పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్క విషయంలోనూ కచ్చితత్వాన్ని తీసుకొస్తున్నామని తెలిపాడు. అలాగే ప్రేక్షకుల సహనానికి థాంక్స్ కూడా చెప్పాడు. మరిన్ని వివరాలతో త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానంటూ ట్వీట్ చేశాడు అక్కినేని బుల్లోడు.
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ''ప్రేక్షకుల్ని ఎలా సంతృప్తిపరచాలా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటా. సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఒక గొప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తా అని చెప్పా. ఆ మాట నిజం చేయబోతున్నా. వినాయక్గారు ఇదివరకు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. అనూప్, తమన్లకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నయ్య, నేను బయట పెద్దగా మాట్లాడుకోం. కానీ నా గురించి వేదికలపై చాలా బాగా చెబుతుంటాడు. ఆ మాటల్ని చాలా ఇష్టపడుతుంటా'' అన్నారు.

వి.వి.వినాయక్ చెబుతూ ''ఒక సూపర్హిట్ సినిమా ఇస్తానని నాగార్జునగారికి మాటిచ్చా. ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాం. సినిమా తీసినవాడిగా నేను చెబుతున్నా అఖిల్ తప్పకుండా సూపర్స్టార్ అవుతాడు''అన్నారు.
శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.


Click it and Unblock the Notifications











