‘జంప్ జిలానీ’ నేతలను టెన్షన్ పెట్టిన అల్లరి నరేష్
హైదరాబాద్: 'ఈ రాష్ట్రంలో జంప్ జిలానీలు ఎవరు? రేపు చూడండి' అంటూ బుధవారం పలు తెలుగు న్యూస్ చానల్స్లో ప్రకటనల మోత మ్రోగించిన సంగతి తెలిసిందే. అసలే రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణం వాడి వేడిగా ఉండటం, రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అవుతున్న తరుణంలో టీవీల్లో ఈ ప్రకటన రావడం చర్చనీయాంశం అయింది.
తీరా చూస్తే.....ఆ ప్రకటన ఇచ్చింది సినిమా నిర్మాతలు. అల్లరి నరేష్ తాజా చిత్రం 'జంప్ జిలానీ' ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్న తరుణంలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఈ పబ్లిసిటీ స్టంట్ వాడారు. ఏది ఏమైనా అల్లరి నరేష్ సినిమా పలువురు రాజకీయ జంప్ జిలానీలను టెన్షన్ పెట్టించింది అనేది మాత్రం వాస్తవం.
ఇ సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంబికా కృష్ణ సమర్పణలో అంబిక రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ సంగీతం అందిస్తుండగా, దాశరథీ శివేంద్ర సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. సమ్మర్లో ఈచిత్రం విడుదలై ప్రేక్షకులకు కితకితలు పెట్టనుంది.


Click it and Unblock the Notifications












