టాలీవుడ్ కు మరో తలనొప్పి.. ఏపీలో అలా తెలంగాణలో ఇలా.. చిన్న సినిమాలకు శాపంగా టీ సర్కార్ జీవో!
ఆంద్రప్రదేశ్లో టిక్కెట్ ధరలు భరించలేని తలనొప్పిగా మారుతుండగా, హైదరాబాద్లో ఇప్పుడు పరిశ్రమకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఒకరకంగా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు చెప్పాలి. అసలు ఏం జరిగింది? ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చి పడిన సమస్య ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే

జీవో నెంబర్ 120
తెలంగాణలో సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు సినీ నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా వాటిని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం టికెట్ రేట్లు నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా జీవో నెంబర్ 120 కూడా జారీ చేశారు.

జారీ చేసిన జీవో ప్రకారం
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో సినిమా టికెట్ కనిష్ట ధర రూ.50 కాగా, గరిష్టంగా రూ.150 గా నిర్ణయించారు. దానికి జీఎస్టీ అదనం. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ కనీస ధర రూ.30 కాగా, గరిష్ఠంగా రూ.70 గా నిర్ణయించారు.
అలాగే మల్టీప్లెక్స్ల్లో టికెట్ కనీస ధర రూ.100+జీఎస్టీ సహా గరిష్టంగా రూ.250+జీఎస్టీగా ఖరారు చేశారు. అలాగే బాగా రిలాక్స్ అయ్యే రిక్లైనర్స్ కోసం రూ.300+జీఎస్టీగా మల్టీప్లెక్స్ల్లో టికెట్ రేట్ల ను నిర్ణయించారు. ఇవికాకుండా నిర్వహణ ఖర్చుల కింద టికెట్పై ఏసీ, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో రూ.5, నాన్ ఏసీలలో రూ.3 వసూలు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు.

295 రూపాయల వరకు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోకు అనుగుణంగా ప్రధాన మల్టీప్లెక్స్లు ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఏషియన్ మాల్స్ (₹175-₹250) మినహా అన్ని ప్రముఖ మల్టీ ప్లెక్స్లు రేపటి నుండి టికెర్ రేట్ ను ₹295 కి పెంచనున్నాయి.
ఒకరకంగా ఈ రేట్లు అన్ని రన్నింగ్ మరియు కొత్త సినిమాలకు వర్తిస్తుంది. కావాలంటే 295 రూపాయల వరకు ధరలు పెంచవచ్చని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఒక G.O.ని జారీ చేసింది, అయితే మల్టీప్లెక్స్లు దానిని ఒక ప్రమాణంగా మార్చాయి.

తర్వాత ఇబ్బందే
పెద్ద చిత్రాలు మినహాయించి, ఇతర చిత్రాలన్నీ ఈ ధరల కారణంగా పెద్ద సమస్యను ఎదుర్కొంటాయని భావిస్తున్నారు, ఎందుకంటే ప్రేక్షకులు అధిక ధరల గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. మల్టీప్లెక్స్లు వారం రోజులలో కనీసం తక్కువ ధరలను ఎంచుకోవాలని అంటున్నారు. స్టార్ చిత్రాలకు కూడా, ఈ ధరలు మొదటి వారాంతం తర్వాత ఇబ్బందే అని అంటున్నారు.

టాలీవుడ్ కు మరో తలనొప్పి
ఒకవేళ దీని మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోకుండా ఉంటే కనుక టాలీవుడ్ కు మరో తలనొప్పి ఏర్పడినట్టే అని చెప్పాలి. ఒక వేళ ఈ రేట్లు కనుక అలాగే ఉంచితే కుటుంబ ప్రేక్షకులు పూర్తిగా థియేటర్లకు దూరంగా ఉండవచ్చు, వారు OTTని ఎంచుకోవచ్చని, రిపీట్ ఆడియన్స్ కి కూడా ఈ రేట్లతో థియేటర్స్ కు రావడం కష్టమే అంటున్నారు. ఏపీలో తక్కువ టికెట్ రేట్లు టెన్షన్ ఉంటే, తెలంగాణలో టికెట్ రేట్ల టెన్షన్ నెలకొంది.


Click it and Unblock the Notifications











