బస్సులు రోడ్డెక్కిన తర్వాతే ‘అత్తారింటికి దారేది’
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె జరుగుతున్న నేపథ్యంలో విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడటం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ముగిసే వరకు సినిమా విడుదల అయ్యే అవకాశం లేదని, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు సమ్మె ముగించి రోడ్డెక్కితే తప్ప సినిమా విడుదల కాదని అంటున్నారు.
సెప్టెంబర్ 21న ఆర్టీసీ బస్సులు సమ్మె బాట వదలి రోడ్డెక్కుతాయని సమాచారం. అదే జరిగితే సినిమాను సెప్టెంబర్ 26న విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు వీలు కాకపోతే అక్టోబర్ నెలలో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే విడుదల విషయమై ఓ క్లారిటీ రానుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.
ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ అత్త పాత్రలో నటించింది. కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












