పూరి జగన్నాథ్ ఆఫీస్పై తెలంగాణ వాదుల దాడి
హైదరాబాద్ : కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర దర్శకుడు పూరి గజన్నాథ్ కార్యాలయంపై తెలంగాణ వాదులు, టీఆర్ఎస్వీ కార్యకర్తలు శుక్రవారం దాడి చేసారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, కార్యాలయం ఆవరణలో ఉన్న కార్లు ధ్వంసం చేసారు. 'కెమెరామెన్ గంగతో రాంబాబు' తెలంగాణ వ్యాప్తంగా దురమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణలోని ప్రముఖ పార్టీని కించ పరిచేలా సన్నివేశాలు, డైలాగులు ఉండటమే తమ ఆందోళనకు కారణమని తెలంగాణ వాదులు చెబుతున్నారు.
పూరి జగన్నాథ్ కార్యాలయంపై దాడి సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు థియేటర్ల వద్ద ఆందోళనలు, షూటింగుల నిలిపివేత లాంటి కార్యక్రమాలు మాత్రమే జరిగాయి. కానీ ఇప్పుడు దర్శకుడి కార్యాలయంపై దాడి చేయడంతో పరిశ్రమలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు.....ఈ చిత్రం ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద భద్రత పెంచారు. ఈచిత్ర నిర్మాత, దర్శకులకు కూడా భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో సన్నివేశాలు తొలగిస్తామని పూరి జగన్నాథ్ మీడియా ముఖంగా చెప్పినప్పటికీ దాడి చేసారని పూరి కార్యాలయం సిబ్బంది తెలిపారు.
'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఎవరి మనోభావాలు కించపరచడానికి తీయలేదని, ఒక వేళ అలా జరిగి ఉంటే వెంటనే ఆ సన్నివేశాలను, డైలాగులను వెంటనే తొలగిస్తాతమని చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మీడియా ముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











