‘ఎన్టీఆర్ బొమ్మల కొలువు’ సందర్శించిన బాలయ్య (ఫోటోలు)
హైదరాబాద్: ఎన్టీఆర్ జీవిత విశేషాలకు అద్దం పడుతూ చిత్రకారుడు కత్తి బాలకోటేశ్వరరావు ఆవిష్కరించిన చిత్రాలను శుక్రవారం సినీ నటుడు బాలకృష్ణ వీక్షించారు. 'అన్నగారి బొమ్మల కొలువు' పేరిట గీసిన ఈచిత్రాల్ని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాలుగు రోజులుగా ప్రదర్శనకు ఉంచారు.
బాలయ్య కృష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ బొమ్మల కొలువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి చిత్రాలను బాల కోటేశ్వరరావు కన్వాస్ పై ఆవిష్కరించిన తీరు ఎంతోబాగుందని కొనియాడారు. బాల కోటేశ్వరరావును అభినందించారు.
బాల కోటేశ్వరరావు గీసిన చిత్రాలను వీక్షిస్తూ....ఎన్టీఆర్ గురించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామరావు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు లాంటి పౌరాణిక పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన యుగపురుషుడు ఎన్టిఆర్. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నటసార్వబౌముడు నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ.

నందమూరి తాకర రామారావు
ఎన్టిఆర్ పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో పూర్తి చేసి ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో చేరాడు. కళాశాల విద్య కొనసాగుతుండగానే మేనమామ కూతురు బసవ తారకంను వివాహమాడి గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బిఎ చేశారు. ఎన్టిఆర్కు మొదటి నుంచి నాటక రంగంపై మక్కువ ఎక్కువ. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో చదువుతున్నప్పడు నాగమ్మ పాత్ర వేశారు. నూనూగు మీసాలు తీసేందుకు ససేమిరా అనడంతో ఆ పాత్రకు మీసాల నాగమ్మ అని పేరు తగిలించారు. గుంటూరు క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పడు నేషనల్ ఆర్ట్ థియేటర్ను ఏర్పాటు చేసి జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం తదితరులతో "చేసిన పాపం" వంటి నాటకాలు ఆడారు.

సినిమా రంగంలోకి ఇలా..
సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా చేస్తోన్న ఎన్టిఆర్ చెన్నై ట్రేన్ ఎక్కేశారు. తొలి అవకాశం 'పల్లెటూరి పిల్ల' సినిమాకు వచ్చినా విడుదలైంది మాత్రం 'మనదేశం' చిత్రం. షావుకారు చిత్రం తరువాత నివాసాన్ని చెన్నై థౌజండ్ లైట్స్ ప్రాంతానికి మార్చుకున్నారు. విజయావారి బ్యానర్పై వచ్చిన పాతళబైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్టిఆర్ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి. మాయాబజార్, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత ఎన్టిరామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. కన్యాశుల్కం, గుండమ్మకథ, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్ రాముడు, సర్ధార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఎన్టిఆర్ నటించిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్. తన కెరీర్లో ఆయన దాదాపు 320కి పైగా చిత్రాల్లో నటించారు.

రాజకీయ సంచలనం
చిత్ర సీమలో నెంబర్ వన్గా నిలిపిన అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని తలిచిన ఎన్టిఆర్ తెలుగుదేశం అనే రాజకీయపార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











