ఆ కసి 'లెజెండ్'తో తీర్చుకోబోతున్న బాలకృష్ణ
హైదరాబాద్ : సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే... తరువాత దెబ్బ మామూలుగా ఉండదని అర్థం. బాలకృష్ణ ప్రయాణం కూడా అంతే. ఆయనకి పరాజయాలు ఎదురయ్యేకొద్దీ కసి పెరుగుతుంటుంది. ఆ కసినంతా ఒకే ఒక్క సినిమాతో తీర్చేసుకొంటుంటారు. ఉదాహరణకు 'సింహా' సినిమానే. 'శ్రీరామరాజ్యం'తో నటుడిగా అందరి మెప్పు పొందిన బాలకృష్ణ... ఆ తర్వాత 'శ్రీమన్నారాయణ' అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఫలితం కాస్త తారుమారైంది. ఇప్పుడు ఆ కసి 'లెజెండ్'తో తీర్చుకోబోతున్నాడని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు.
'సింహా' తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న చిత్రం 'లెజెండ్'. 14 రీల్స్, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. గురువారం నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. దాదాపు వారం రోజుల పాటు నగరంలోనే చిత్రీకరణ జరుగుతుంది. ప్రధాన తారాగణంతో పాటు వందమంది జూనియర్ ఆర్టిస్టులు ఈ చిత్రీకరణలో పాలుపంచుకొంటారు.
ఈ సినిమాలో బాలకృష్ణని చూపించేందుకు బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. తెరపై ఆయన్ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కారు, బైక్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇటీవల 'లెజెండ్' బైక్ని తయారు చేసిన విధానాన్ని వీడియో రూపంలో విడుదల చేశారు. అలాగే ఒక సఫారీ వాహనాన్ని కూడా ప్రత్యేక హంగులతో తయారు చేయించారు. అవన్నీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
''సింహా తరవాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న చిత్రమిది. అంచనాలు తప్పకుండా అందుకొంటాం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్కు మంచి స్పందన వచ్చింది. జగపతిబాబు విలన్ గా నటించారు''అని నిర్మాతలు చెబుతున్నారు. మార్చిలో 'లెజెండ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












