బాలకృష్ణ 'లయన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం 'లయన్'. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. సత్యదేవా దర్శకుడు. మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో అత్యంత అట్టహాసంగా జరిగింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తారు... చచ్చాక వినిపిస్తారు. నీకు యుద్ధానికి ముందు వినిపించమంటావా? లేక చచ్చాక వినిపించమంటావా?' అనే సినిమాలోని సంభాషణ చెప్పి అభిమానులను బాలకృష్ణ అలరించారు.
''తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ హీరో అంటే బాలయ్యనే. ఆయన పోషించే పాత్రలను పరిశ్రమలో ఇంకెవరూ చేయలేరు. ఏ సినిమా నటుడికీ లేనంత అభిమానగణం బాలకృష్ణకు ఉంది. చిత్ర పరిశ్రమలో ఆయనకు పోటీనే లేదు. బాలయ్యకు బాలయ్యే పోటీ'' అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గురువారం రాత్రి హైదరాబాద్లో జరిగిన 'లయన్' పాటల విడుదల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉపముఖ్యమంత్రులు చిన్నరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, తెదేపా నాయకులు రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, రేవంత్ రెడ్డి, నటి జయసుధ, నిర్మాత కేఎల్ నారాయణ, తదితరులు హాజరయ్యారు. ఎస్ఎల్వీసీ పతాకంపై ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.
స్లైడ్ షోలో లో మిగతా విశేషాలు..

తొలి సీడిని..
తొలి సీడీని నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించి నందమూరి బాలకృష్ణకు అందజేశారు.

ట్రైలర్ ని..
నందమూరి రామకృష్ణ, బోయపాటి శ్రీను, పరిటాల శ్రీరామ్ సంయుక్తంగా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.

త్రిష మాట్లాడుతూ...
''బాలకృష్ణగారితో గతంలో కొన్ని సినిమాలు చేసే అవకాశం వచ్చినా కుదర్లేదు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుండటం ఆనందంగా ఉంద''ని చెప్పింది.

సత్యదేవా మాట్లాడుతూ...
''ఏడేళ్ల క్రితం బాలకృష్ణగారికి ఈ కథ చెప్పాను. ఆయన నన్ను గుర్తుంచుకొని మరీ పిలిపించి ఈ సినిమా చేద్దామన్నారు. ఆయన తెరపైనే కాదు బయట కూడా హీరోనే. ఆయన ప్రోత్సాహంతోనే ఈ సినిమా చేయగలిగాం. రేపు సాధించే విజయానికీ ఆయనే కారణమవుతార''న్నారు.

నిర్మాత మాట్లాడుతూ...
''నా అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు, నా అభిమాన కథానాయకుడు బాలకృష్ణతో కలసి ఈ వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. అభిమానిని నిర్మాతను చేసే ధైర్యం ఒక్క నందమూరి కుటుంబానికే ఉంద''న్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ....
''తెలుగు ప్రజలు కీర్తి ప్రతిష్ఠలు, భోగభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. తెలుగు గడ్డ రెండుగా చీలిపోయింది. 'ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒక్కటే. యాసలు వేరైనా మన భాష ఒక్కటే' అని ఆనాడే నాన్నగారు చెప్పారు.

బాలకృష్ణ కంటిన్యూ చేస్తూ...
ప్రజల మనోభావాల్ని గౌరవించాల్సిందే. తెలుగు జాతి బాగుండాలని వాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కాలని నాన్నగారు కోరుకున్నారు. అందుకే సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చారు. నటనతోపాటు బాధ్యతలను నాకు వారసత్వంగా ఇచ్చారు. హిందూపురం నా హృదయమైతే తెలుగు జాతి నా శరీరం. తెలుగు ప్రజలంతా సమష్టిగా ముందడుగు వేయాలి.

ఎన్టీఆర్ అభిమానులే...
ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతో పాటుపడుతున్నారు. తెలంగాణకు ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉండటానికి కారణం గతంలో చంద్రబాబు చేసిన అభివృద్దే. తెలుగుదేశం కార్యకర్తలంతా ఎన్టీఆర్ అభిమానులే. నాన్నగారు ఆత్మీయాభిమానాలను నాకందించారు. అభిమానుల బలం ఉన్నంతవరకు నేను లయన్గానే ఉంటా. మణిశర్మ ఈ సినిమాకు మంచి బాణీలిచ్చారు.

లెజండ్ 400 రోజులు
సత్యదేవాకి ఇదే తొలి చిత్రమైనా అభిమానులందరినీ అలరించేలా చిత్రాన్ని రూపొందించారు. 'పాతాళభైరవి' మొదటిగా వంద రోజులు ఆడిన సినిమా, 'అడవి రాముడు' 300 రోజులు ఆడింది. ఇప్పుడు 'లెజెండ్' 400 రోజులు ఆడుతూ చరిత్ర సృష్టిస్తోంది. మే 2న ఎమ్మిగనూరులో వేడుక జరుపుకోబోతున్నాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు'' అన్నారు బాలకృష్ణ.

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....
''లయన్' ప్రచార చిత్రాలు సునామీని తలపించాయి. సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. నందమూరి తారకరామారావుగారికి, బాలకృష్ణకు సింహా అనే పేరు బాగా కలిసొచ్చింది. 'సమరసింహారెడ్డి' 'నరసింహనాయుడు' పాటల విడుదల వేడుకకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చాను. ఆ సినిమాలు చరిత్ర సృష్టించాయి.

చంద్రబాబు కంటిన్యూ చేస్తూ..
ఇప్పుడు మళ్లీ ఈ వేడుకకు సీఎంగా వచ్చాను. ఈ సినిమా కూడా చరిత్ర సృష్టించడం ఖాయం. బాలకృష్ణ పలికిన సంభాషణలు చాలా బాగున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ చాలా అందంగా కనిపించారు. ప్రచార చిత్రాలే ఇలా ఉన్నాయంటే సినిమా ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

విదేశాలకు వద్దు...
తెలుగు చలన చిత్ర నిర్మాతలను నేను కోరుకునేదొక్కొటే. సినిమాల చిత్రీకరణ కోసమని విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నేరుగా విశాఖపట్నం రండి. రాజమండ్రి, కోనసీమల్లోనూ మంచి లొకేషన్లు ఉన్నాయి. భారతదేశంలో ఏ సినిమా ఔట్డోర్ షూటింగ్ కోసమైనా ఆంధ్రప్రదేశ్కే రావాలనుకునేలా ఆయా ప్రాంతాల్లో పరిశ్రమను అభివృద్ధి చేస్తాం అన్నారు చంద్రబాబు నాయుడు

సంవత్సరం పాటు ఆడుతుంది
దేశంలోనే కాదు విదేశాల్లోనూ తెలుగు సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. తెలుగువారిని ఏకం చేసే శక్తి తెలుగు దేశం పార్టీకే ఉంది. సుపరిపాలనతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నాం. ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలు కొట్టి సంవత్సరంపాటు ఆడుతుందని ఆశిస్తున్నా. సంవత్సర వేడుకకు మళ్లీ వస్తా'' అన్నారు చంద్రబాబు నాయుడు.

ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ .....
''బాలకృష్ణగారికి మా రాయలసీమ అచ్చొచ్చింది. ఆయన విజయవంతమైన చిత్రాలన్నీ మా ప్రాంతం నేపథ్యంలోనే వచ్చాయ''న్నారు.

ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ....
''నందమూరి తారకరామారావు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రజల మనసుల్ని గెలుచుకున్నారు. ఇప్పుడు ఆయన వారసత్వం అందుకున్న బాలకృష్ణగారు ఎన్నో మంచి పాత్రలు చేస్తున్నార''న్నారు.

ఎవరెవరు..
ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పార్ధసారథి, తెదేపా నాయకులు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, యామినీ బాల, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎల్.రమణ, బాబురావు, సినీ ప్రముఖులు అంబికా కృష్ణ, జయసుధ, జెమిని కిరణ్, శ్రీవాస్, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











