బాహుబలి బ్లాక్ బస్టర్.. విడుదలకు ముందే సీక్రెట్ చెప్పిన రాజమౌళి
బాహుబలి2 విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో బాహుబలి1, బాహుబలి2 చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకొన్నారు.
సాంకేతిక పరిజ్క్షానంతో ప్రయోగాలు చేయడంలో సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా బాహుబలి2 విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో బాహుబలి1, బాహుబలి2 చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకొన్నారు. బాహుబలి1 మ్యాజిక్ చేయడం వెనుక తన ఆలోచనలను, కృషిని వెల్లడించారు.

గ్రాండ్గా తెరకెక్కించాలని..
భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అద్భుతమైన రీతిలో గ్రాండ్గా తెరకెక్కించాలన్నది నా సంకల్పం. బాహుబలితో ఆ కల నెరవేరింది. చాలా రిచ్గా, హాలీవుడ్కు ధీటుగా టెక్నాలజీని వినియోగించడం వల్లనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.

ప్రతీ సన్నివేశంలోను తపన
ప్రతీ సన్నివేశంలో కొత్తదనం కనిపించాలని తపన పడ్డాను. పిల్లలను ఆకట్టుకోవడానికి కాలకేయ తెగకు సంబంధించిన కొత్త భాషను లిఖించాం. అదీ ప్రయోగమే అయినప్పటికీ మంచి స్పందన లభించింది. ఇలాంటి ఎన్నో విశేషాలు ఉండటం వల్లనే బాహుబలి బ్లాక్ బస్టర్ అయింది. ఇవే బాహుబలి1 సక్సెస్ వెనుక విజయ రహస్యం.

బాహుబలి1కు అంతర్జాతీయ ఆదరణ
సినిమా పరిశ్రమను బాలీవుడ్ చిత్రాలు ఏలుతున్న నేపథ్యంలో ప్రాంతీయ చిత్రంగా విడుదలైన బాహుబలి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమపై ప్రత్యేక దృష్టిని ఆకర్షించేలా దర్శకుడు రాజమౌళి సఫలమయ్యారు. అందరి అంచనాలు పటాపంచాలు చేస్తూ బాహుబలి చిత్రం దాదాపు రూ.650 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓ ప్రాంతీయ చిత్రం ఇంతమొత్తంలో కలెక్షన్లను కొల్లగొట్టడం ఇదే తొలిసారి.

ఐమాక్స్, వీఆర్ టెక్నాలజీ..
బాహుబలి1 మాదిరిగా కాకుండా ఇంకా ఏదైనా కొత్త టెక్నాలజీతో ప్రేక్షకుడిని థ్రిల్కు గురిచేయాలన్న ఆలోచన గత కొద్దికాలంగా వెంటాడుతున్నది. అందుకే బాహుబలి2లో ఐమాక్స్ టెక్నాలజీని, వర్చువల్ రియాల్టీ (వీఆర్) సాంకేతికతను ఉపయోగించాం. దీంతో ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళ్లడానికి వీలువుతుంది. యుద్ధ పోరాటలు, మాహిష్మతి సామ్రాజ్యం అద్భుత కట్టడాలను ప్రేక్షకుడు చూసి థ్రిల్ గురవ్వడానికి అవకాశం ఉంటుంది.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..
బాహుబలి ది బిగినింగ్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరిని ఒక ప్రశ్న వెంటాడుతున్నది. ఎంతో ఆప్యాయతతో పెంచిన బహుబలిని కట్టప్ప ఎందుకు చంపారన్నది అన్ని వర్గాల ప్రజలకు ప్రశ్నగా మిగిలింది. ఈ అంశం బాహుబలి2 చూడాలనే మరింత క్యూరియాసిటిని పెంచింది.

అసలు కథ బాహుబలి2లోనే..
బాహుబలి1 చిత్రంలో పాత్రలను పరిచయం చేసే సరికే మొదటి భాగం సరిపోయింది. మాహిష్మతి సామ్రాజ్యంలో అంతర్గత యుద్ధం రావడానికి కారణం ఏమిటో అనే సందేహం ప్రేక్షకుల మదిలో గత రెండేళ్లుగా నానుతున్నాయి. ప్రభాస్, అనుష్కల పాత్రలకు మొదటి భాగంలో అంతగా ప్రాధాన్యం లేదు. రెండో భాగంలోనే అసలు కథ మొదలు కానున్న నేపథ్యంలో బాహుబలి2 ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధం
బాహుబలి విడుదల అనంతరం రెండేళ్ల తర్వాత బాహుబలి2 ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











