‘మహానటి’చిత్రం గురించి కీర్తి సురేష్, దర్శకుడునాగ్ అశ్విన్ ఏమంటారంటే
మహానటి సావిత్రి జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి ఎవడే సుబ్రమణ్యంతో పరిచయమైన డైరక్టర్ నాగ్ అశ్విన్ ఫస్ట్ లుక్ లాంటి పోస్టర్ రిలీజ్ చేసారు.
హైదరాబాద్: మహానటి సావిత్రి జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించడానికి ఎవడే సుబ్రమణ్యంతో పరిచయమైన డైరక్టర్ నాగ్ అశ్విన్ సంసిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంభందించి చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో సమంత, కీర్తి సురేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని పేర్కొన్నారు. అయితే సావిత్రి పాత్రను ఎవరు పోషిస్తున్నారన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం పోస్టర్ను సమంత ట్విటర్లో పోస్ట్ చేశారు. 'మాయాబజార్' చిత్రంలో సావిత్రి స్టిల్కు ఇరువైపులా సమంత, కీర్తి సురేశ్ ఉన్న ఈ పోస్టర్పై 'తరాలను నిర్మించే స్త్రీజాతి కోసం.. తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ' అని రాసి ఉంది.
'అందమైన, శక్తిమంతమైన, సాధికారత గల సోదరీమణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇందులో అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్కు ధన్యవాదాలు' అని సమంత ట్వీట్ చేశారు. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
మరి ఈ విషయమై కీర్తి సురేష్ చాలా ఆనందంగా స్పందంచారు. ఇలాంటి ప్రాజెక్టులో భాగమైనందుకు ఆనందిస్తున్నట్లు తెలియచేసారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... పురుషాధీక్యత కలిగిన సినీరంగంలో సావిత్రి మహానటిగా కీర్తిని సంపాదించుకుంది. 1950-60దశకంలో తమిళ, తెలుగు చిత్రసీమలో అగ్రనాయికగా పేరు తెచ్చుకుంది. 31ఏళ్ల సుదీర్ఘ నటజీవితంలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 263 చిత్రాల్లో నటించింది.
సావిత్రి జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విశేషాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం. తెలుగువారు గర్వించేలా వుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కించనున్నాం అన్నారు.
అలాగే ''ఆనాటి ఆనవాళ్లను మళ్లీ సెల్యులాయిడ్పై పునః సృష్టి చేయనున్నాం.సామాన్య స్త్రీ నుంచి ఓ సూపర్స్టార్గా సావిత్రి ఎదిగిన తీరు నేటి తరానికి మంచి పాఠంలా మిగిలిపోయింది. ఇన్నేళ్ళలో ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారు. నటీమణుల్లో చాలా తక్కువ మంది 'లెజెండ్' హోదాన్ని దక్కించుకున్నారు. వాళ్లలో సావిత్రిగారు ఒకరు. ఆమె గడిపిన జీవితం, ఎదుర్కొన్న అనుభవాల కలబోతే ఈ చిత్రం'' అని నాగ అశ్విన్ పేర్కొన్నారు.
సావిత్రి జీవితంలోని మరపురాని ఘట్టాలు, ఆసక్తికరమైన అంశాలూ ఈ కథలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. మరి సావిత్రిగా ఎవరు నటిస్తారు? ఈ చిత్రం ఎప్పుడు సెట్స్పైకి వెళ్తుంది? అనే అంశాలు తెలియాల్సి ఉంది. సావిత్రినీ, ఆమె నటించిన చిత్రాల్నీ మర్చిపోలేం. ఆమె జీవితం కూడా ఓ పాఠం లాంటిదే. సినిమాలోని మలుపులూ, గెలుపులూ ఆమె కథలోనూ ఉన్నాయి. అందుకే ఇప్పుడు సావిత్రి జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్నట్టు చెప్తున్నారు.
ఒక మహానటి జీవితానికి తెరరూపం ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రెండో సినిమాతోనే అలాంటి ప్రయత్నం చేయడం అంటే నాగ అశ్విన్ని అభినందించాల్సిందే.


Click it and Unblock the Notifications











