మళ్ళీ తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కాల్ డేటా రికార్డింగ్స్ మిస్సింగ్?
టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు కూడా జరిపారు. రెండో సారి పూరి జగన్నాథ్ మొదలు తనీష్ దాకా చాలా మంది సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ జరిపారు. ఆ తరువాత ఎలాంటి వార్త లేకపోవడంతో ఇక ఆ కేసు ముగిసింది అనుకున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరో మారు తెర మీదకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

రెండు దఫాల విచారణ
2017వ సంవత్సరంలో టాలీవుడ్ మొత్తం మీద సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో పూరీ జగన్నాథ్ సహా మిగతా విచారణకు హాజరైన అందరి దగ్గర నుంచి రక్తం, వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ద్వారా వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనే అంశం మీద ఫోరెన్సిక్ లాబొరేటరీలో టెస్టులు జరగగా వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నట్టు ఆధారాలు ఏవీ లేవని తేలింది.

క్లీన్ చిట్
2018 జూలై లో నలుగురు సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారనే ఆధారాలు దొరకడంతో పాటు వాళ్ళ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయి ప్రచారం జరగగా ఆ తర్వాత అది నిజం కాదని తేలింది. అయితే ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ తరువాత అందరికీ నోటీసులు జారీ చేసి చాల రోజుల పాటు ప్రశ్నించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్న క్రమంలోనే ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ సినీ ప్రముఖులు ఎలాంటి డ్రగ్స్ వాడిన ఆనవాళ్లు లేవని క్లీన్ చిట్ కూడా ఇచ్చింది.

కాల్ రికార్డింగ్ డేటా పంపకపోవడంతో
ఇప్పుడు మరో మారు టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు ఇవ్వమంటూ ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ సెలబ్రిటీలను విచారణ జరిపినప్పుడు మొత్తం 41 మంది కాల్డేటా రికార్డింగ్స్ నమోదు చేసింది. అదే ఏడాది దాని ఆధారణంగా 12 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. డ్రగ్స్ నిందితులతో పాటు సాక్షుల నుంచి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఎక్సైజ్ సుపరిండెంట్ కోర్టుకు తెలిపారు.

41 మంది కాల్డేటా
డ్రగ్ పెడ్లర్ కెల్విన్తో సినిమా నటులకు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ బయటికి తీసిన ఎక్సైజ్ శాఖ అది మాత్రం ఈడీకి పంపలేదట. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతో పాటు ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ను ఇవ్వాలని ఈడీ కోరింది. వాటి వివరాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేమని ఎక్సైజ్ శాఖ తెలపగా కోర్టుకు వాంగ్మూలాల కాపీలు మాత్రమే అందాయని వారికి కూడా ఆ వివరాలు ఇవ్వలేదని ఈడీ లేఖలో పేర్కొంది.

ఆ రికార్డులు ఎక్కడ?
తమకు అందించిన ఆధారలాలో ఎక్కడా కూడా కాల్ డేటా రికార్డింగ్స్ లేవని ఈడీ లేఖలో పేర్కొంది. కోర్టులో కూడా ఆ వివరాలు లేవని తేలడంతో ఆ రికార్డులు ఎక్కడ ఉన్నాయి అనే చర్చ జరుగుతోంది. మరి ఈ వ్యవహారం మీద ఎక్సైజ్ శాఖ ఎలా స్పందించనున్నది అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











