కాన్స్ లో అదరకొట్టిన మన 'డబ్బా' సినిమా

హిందీలో రూపుదిద్దుకున్న 'డబ్బా' చిత్రాన్ని 'ది లంచ్ బాక్స్' పేరుతో ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. రితీష్ బత్రా దర్శకత్వం వహించగా ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, నిమ్రత్ కౌర్లు ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ కశ్యప్, గునీత్ మోంగాలు సంయుక్తంగా నిర్మించారు.
జీవితంలో అసంతృప్తితో రగిలిపోయే భార్యగా నిమ్రత్ కౌర్, పదవీ విరమణకు చేరువలో ఉన్న ప్రభుత్వ అధికారిగా ఇర్ఫాన్ ఖాన్లు ఈ చిత్రంలో నటించారు. వీరి జీవితంలో ఒక డబ్బా(లంచ్ బాక్స్) ఏ విధంగా పెనుమార్పులు తెచ్చిందో వివరించే చిత్రమిది. కాన్స్లో ప్రదర్శించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో దర్శకుడు ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు. మన జీవితాల్లో సంభవించే వాస్తవ సంఘటలను తన చిత్రంలో ప్రతిబింబించడానికి ప్రయత్నించానని ఆయన తెలిపారు.
ఈ ఏడాది మన సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో గెస్ట్ కంట్రీ గా పాలుపంచుకోవటం, 'బాంబే టాకీస్' వంటి విభిన్న ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రాలను ప్రదర్శించటం చెప్పుకోదగ్గ విషయం. మన చిత్ర పరిశ్రమ నుంచి కాన్స్లో పలు చిత్రాలు ప్రదర్శిస్తున్నప్పటికీ పురస్కారాల పరుగులో మాత్రం ఎప్పుడూ వెనుకనే ఉండటం ఆలోచించాల్సిన విషయం.
కానీ 14 ఏళ్ల తర్వాత 'డబ్బా' అనే చిత్రం కాన్స్ చిత్రోత్సవంలో 'వ్యూయర్స్ ఛాయిస్ అవార్డు' సొంతం చేసుకుంది. ఇంతకు ముందు 1999లో రూపుదిద్దుకున్న తక్కువ నిడివిగల(షార్ట్ ఫిల్మ్) మలయాళ చిత్రం 'మరణ సింహాసనం' 'కెమెరా డి ఓర్ అవార్డు'ను దక్కించుకుంది.
గత వారం జరిగిన కాన్స్ చిత్రోత్సవంలో మన దేశ చలన చిత్రాలతో పాటు నటులు, సాంకేతిక నిపుణులు కూడా సందడి చేశారు. ప్రతి ఏడాదిలాగే బాలీవుడ్ సినీ తారలు రెడ్ కార్పెట్పై నడిచి అభిమానులను అలరించారు. విద్యాబాలన్ ఈ చిత్రోత్సవంలో న్యాయనిర్ణేతగా వ్యవహరించడంతో పాటు మన దేశ కట్టూబొట్టును ప్రతిబింబించే వస్త్రధారణలో కనువిందు చేశారు. ఐశ్యర్యారాయ్, సోనమ్ కపూర్లు సంప్రదాయ, పాశ్చాత్య దుస్తుల్లో మెరిశారు.


Click it and Unblock the Notifications











